ఈపీఎఫ్‌ఓ పింఛనుదారులకు ఓ ప్రత్యేక సదుపాయం..!

ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగ భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) పింఛనుదారులకు ఓ ప్రత్యేక సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇంటి నుంచే డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌/జీవన ప్రమాణ పత్రం(డీఎల్‌సీ) దాఖలు చేసే వెసులుబాటును కల్పించింది.ఇందులో భాగంగా ఇండియా పోస్ట్‌ పేమెంట్స్‌ బ్యాంక్‌(ఐపీపీబీ) డోర్‌స్టెప్‌ డీఎల్‌సీ సేవలను ప్రారంభించింది. దీని ద్వారా నిర్దేశిత ఫీజు చెల్లించి డీఎల్‌సీ దాఖలుకు ఆన్‌లైన్‌లో అభ్యర్థన చేసుకోవాలి. అనంతరం సమీప తపాలా కార్యాలయం నుంచి పోస్ట్‌మేన్‌ పింఛనుదారుడి ఇంటికి వచ్చి డీఎల్‌సీ దాఖలు ప్రక్రియను పూర్తి చేస్తారు.

ఈ విధానంతో పాటు పింఛను ఖాతా ఉన్న బ్యాంకు శాఖలు, సమీప పోస్టాఫీసులు, దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల కామన్‌ సర్వీస్‌ సెంటర్లలోనూ డీఎల్‌సీ దాఖలు చేసే సౌకర్యం అందుబాటులో ఉంది. ఉమాంగ్‌ యాప్‌ ద్వారానూ ఈ ప్రక్రియ పూర్తి చేయొచ్చు.

గతంలోలాగే ఈపీఎఫ్‌ఓకు చెందిన 135 ప్రాంతీయ, 117 జిల్లా కార్యాలయాల్లోనూ డీఎల్‌సీ దాఖలుకు అవకాశం ఉంది. వీటిలో ఏ విధానం ద్వారా చేసినా డీఎల్‌సీని ఈపీఎఫ్‌ఓ ఆమోదిస్తుంది. కొత్త నిబధనల ప్రకారం డీఎల్‌సీని ఏడాదిలో ఎప్పుడైనా దాఖలు చేయొచ్చు. దాఖలు చేసిన తేదీ నుంచి ఏడాది పాటు దానికి కాల పరిమితి ఉంటుంది.