వాసన్ ఐ కేర్ పేరిట దేశవ్యాప్తంగా నేత్ర వైద్యశాలలను ప్రారంభించిన ఆ సంస్థ వ్యవస్థాపకుడు డాక్టర్ ఏఎం అరుణ్ (51) చెన్నైలో కన్నుమూశారు. సోమవారం ఉదయం చలనం లేకుండా పడిఉన్న ఆయనను ఇంట్లోవారు గుర్తించి ఓ కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సహజ మరణంగానే భావిస్తున్నామని చెప్పారు.
అయితే బంధువుల డిమాండ్ మేరకు పోలీసులు మృతదేహాన్ని శవపరీక్షకు పంపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. తిరుచురాపల్లిలో 60 ఏళ్లుగా నడుస్తున్న ఓ ఔషధ దుకాణాన్ని కొని వైద్య సేవల రంగంలోకి అడుగుపెట్టిన అరుణ్ దేశవ్యాప్తంగా 100కు పైగా నేత్ర వైద్యశాలలను స్థాపించే స్థాయికి ఎదిగారు.
వాసన్ హెల్త్ కేర్ పేరిట నేత్ర, దంత వైద్యసేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పేదలకు తక్కువ ధరలోనే వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో నిర్విరామంగా కృషి చేసిన తన ప్రియమిత్రుడి అకాల మరణం కలిచివేసిందని శివగంగ ఎంపీ కార్తి చిదంబరం అన్నారు.
మళ్లీ అక్కడ కరోనా డేంజర్ బెల్!