పాకిస్తాన్ చెరలో చిక్కుకున్న వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ మిగ్ నుంచి బయటపడ్డ సమయం నుంచి సైన్యానికి దొరికే వరకు చాలా విషయాలు జరిగాయి. పాక్కు చెందిన ఎఫ్-16ను పరుగులు పెట్టించి కూల్చేసిన అభినందన్.. మిగ్ 21లో ఏర్పడిన సాంకేతిక సమస్యల కారణంగా పాక్ భూభాగంలో ప్యారాచూట్ సాయంతో దిగిపోయారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది పాకిస్తాన్ ప్రముఖ పత్రిక డాన్ రాసింది.
‘‘పారాచూట్ సాయంతో ఓ వ్యక్తి సురక్షితంగా దిగుతుండటం కనిపించింది అతని ఎయిర్ఫోర్స్ డ్రెస్ కనిపిస్తూనే ఉంది. తనెక్కడ దిగాడో అర్థం కానట్టుంది తన దగ్గర ఓ పిస్టల్, కొన్ని మ్యాపులు ఉన్నయ్ పడిన వెంటనే కాస్త ఊపిరి పీల్చుకునేలోపు కొందరు స్థానికులు అక్కడికి చేరుకున్నారు. తనెవరో వాళ్లకూ తెలియదు నేనెక్కడ ఉన్నాను, ఇది ఇండియా? పాకిస్థానా..? అనడిగాడు ఓ స్థానికుడు ఇది ఇండియా అని అబద్ధం చెప్పాడు. కానీ అభినందన్ నమ్మినట్టు కనిపించలేదు నిజం చెప్పండి అంటూ అరిచాడు. తన చుట్టూ రౌండప్ చేయటానికి ప్రయత్నిస్తున్న స్థానికులను గమనించి ఒక్క ఉదుటున లేచి ఇండియా దిశగా ఓ అరకిలోమీటర్ పరుగు తీశాడు స్థానికులు వెంటపడ్డారు పిస్టల్ చూపిస్తూ, అదిలిస్తూ అలాగే పరుగు తీసిన అభినందన్ హెచ్చరికగా గాలిలోకి కాల్పులు కూడా జరిపాడు.
ఈ లోపు తనకు కనిపించిన ఓ నీటికుంటలోకి దూకి, తన వెంటన ఉన్న డాక్యుమెంట్లు, మ్యాపులను నమిలి మింగేందుకు ప్రయత్నించాడు. ఆ ముక్కల్ని నీటిలో ముంచాడు. పిస్టల్ కింద పడేయాలంటూ స్థానికులు అరిచారు. ఓ యువకుడు తన దగ్గరున్న తుపాకీతో పైలట్కు గురిపెట్టాడు. అప్పటికే తన వద్ద ఉన్న పత్రాల్ని నిరుపయోగం చేసిన అభినందన్, ఇక చేసేదేమీ లేక, పరిస్థితి అర్థమైపోయి ‘డోంట్ కిల్ మి’ అని అరిచాడు. అప్పటికే అభినందన్ను చుట్టుముట్టిన స్థానికులు తనను చితకబాదారు. రక్తం కారుతున్నప్పటికీ ఆ పైలట్ నిబ్బరం కోల్పోలేదు. తనను ఆర్మీకి అప్పగించాలని అడిగాడు. కొద్దిసేపటికి సైనికులు కొందరు అక్కడికి చేరుకున్నారు. తనను అదుపులోకి తీసుకున్నారు. తరువాత ఓచోట అభినందన్ను ప్రశ్నిస్తున్న తీరు, తను ఏమీ చెప్పలేనంటూ వివరాలు చెప్పటానికి నిరాకరించిన తీరు అందరూ అదే పాకిస్థాన్ మీడియా, అధికారిక సైట్లు ప్రదర్శించాయి. ఆ తెగువ, ఆ నిబ్బరమే ఇప్పుడు ఆ కమాండర్ను జాతీయ హీరోను చేశాయి.
ఇక పాక్ మొదట ప్రకటించిన రెండో పైలట్ ఎవరో కాదు.. పాక్ యుద్ధ విమానం నడిపి ఎఫ్-16 పైలట్. అభినందన్ కూల్చిన ఎఫ్-16 పైలట్ కూడా పారాచూట్ సాయంతో కిందకి దిగాడు. పాక్ భూభాగంలో అడుగుపెట్టిన అభినందన్ను బందీగా పట్టుకున్న పాక్ ప్రజలు.. మరోవైపు తమ పైలట్ విషయంలోనూ పొరపాటు పడ్డారు. తమ పైలట్ను భారత పైలట్గా భావించి చితకబాదారు. దీంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని పైలట్ను రక్షించి ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం సైన్యానికి సమాచారం అందించారు. తొలుత అతడు భారత్ పైలట్ అని భ్రమపడిన సైన్యం కూడా ఇద్దరు భారత పైలట్లను పట్టుకున్నట్టు ప్రకటించింది. కాఈన అసలు విషయం తెలిసి నాలుక్కరుచుకుని ఒక్క భారత పైలట్ మాత్రమే తమ అధీనంలో ఉన్నట్టు ప్రకటించింది.