జమ్ము కశ్మీర్ సరిహద్దుల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇండియన్ ఎయిర్ఫోర్స్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ సైన్యం భావిస్తోంది. పాక్ ప్రభుత్వం కూడా అసహనంతో రగిలిపోతోంది. భారత గగనతలంలో పాక్ యుద్ధ విమానాలు ప్రవేశించాయి. రాజౌరీ సెక్టార్లోకి చొచ్చుకువచ్చిన పాక్ యుద్ధ విమానాలను భారత వైమానిక దళం తిప్పికొట్టింది. భారత గగనతలంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన పాక్ ఫైటర్ జెట్ను ఎయిర్ఫోర్స్ కూల్చివేసిందని అధికారులు చెబుతున్నారు.
భారత్ నుంచి అనూహ్య ప్రతిఘటన ఎదురవడంతో తోకముడిచిన పాకిస్తాన్ తన యుద్ధ విమానాలను తిరిగి తమ గగనతలంలోకి మళ్లించింది. కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతూ మాటువేసి దొంగ దెబ్బ తీసేందుకూ పాక్ దుర్నీతిని ప్రదర్శిస్తోంది. సరిహద్దుల్లో అప్రమత్తంగా ఉన్న భారత దళాలు ఎప్పటికప్పుడు పాక్ కుయుక్తులను తిప్పికొడుతూ ఎలాంటి పరిస్ధితి ఎదురైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.
మరోవైపు భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతల నేపథ్యంలో లీ, జమ్మూ, శ్రీనగర్, పఠాన్కోట్ విమానాశ్రయాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. భద్రతా కారణాల రీత్యా ఎయిర్స్పేస్లో విమానాల రాకపోకలను నిలిపివేశారు. ప్రయాణీకుల విమానాలను ఇతర ప్రాంతాలకు మళ్లించారు. పలు కమర్షియల్ విమానాల సర్వీసులను కూడా పెండింగ్లో ఉంచారు. మరోవైపు ఉడీ, పూంచ్ సెక్టార్లో పాకిస్తాన్ కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడటంతో పలువురు సైనిక సిబ్బందికి గాయాలయ్యాయి.