మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం ‘కొరియన్ కనకరాజు’. రితికా నాయక్ నాయికగా నటించగా, కమెడియన్ సత్య కీలక పాత్రలో అలరించనున్నారు. యూవీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించాయి. అన్ని రకాల కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 7న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మెగా హీరో రామ్చరణ్ చేతుల మీదుగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచేసింది.
‘రక్తసిక్త పిశాచ కొరియన్ కనకరాజు దెయ్యం ఆవాహయామి’ అంటూ సత్య చేసే విచిత్రమైన క్షుద్ర పూజతో మొదలైన ఈ ట్రైలర్ పూర్తిగా కామెడీ, హారర్ ఎలిమెంట్స్ మిశ్రమంగా సాగింది. ఈ చిత్రంలో వరుణ్ తేజ్ పెనుకొండకు చెందిన ‘కనకరాజు’ పాత్రలో కనిపించనున్నారు. అయితే అసలు కనకరాజుకు, కొరియన్ అండర్వరల్డ్ డాన్కు మధ్య సంబంధం ఏంటి? ఒక కొరియన్ డాన్ ఆత్మ కనకరాజు శరీరంలోకి ఎందుకు ప్రవేశించింది? అనే ఆసక్తికరమైన పాయింట్ చుట్టూ ఈ కథ తిరుగుతుందని ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది. ముఖ్యంగా ట్రైలర్ చివర్లో వరుణ్ తేజ్ చెప్పిన ‘‘అహోబిలం లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా.. వాడు నరకానికి పోకుండానే నరకమెట్లుంటదో చూపిస్తా.’’ అనే పవర్ ఫుల్ డైలాగ్ సినిమాకు ప్రధాన హైలైట్గా నిలిచింది.
ఈ సమావేశంలో హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ‘కొరియన్ కనకరాజు’ చిత్రం చేయడం నటుడిగా తనకు ఎంతో సంతృప్తినిచ్చిందని తెలిపారు. అన్ని రకాల వాణిజ్యాంశాలు ఈ కథలో చాలా సహజంగా కుదిరాయని, ఇది కచ్చితంగా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇందులో తాను రెండు భిన్నమైన కోణాల్లో కనిపిస్తానని, ఒకే శరీరంలో రెండు వేర్వేరు ఆత్మలు ఉంటే ఎదురయ్యే సవాళ్లు ఎంతో ఎంటర్టైనింగ్గా ఉంటాయని చెప్పారు. నటనకు పూర్తి ఆస్కారమున్న పాత్ర ఇదని తెలిపారు. దర్శకుడు మేర్లపాక గాంధీ మాట్లాడుతూ, వరుణ్ – సత్యల మధ్య వచ్చే కామెడీ సన్నివేశాలను ప్రేక్షకులు థియేటర్లలో బాగా ఎంజాయ్ చేస్తారని, ఆగస్టు 7న ఈ చిత్రం అందరికీ చక్కటి వినోదాన్ని పంచుతుందని పేర్కొన్నారు.
