హరియాణాకు చెందిన ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ తల్లిదండ్రులు మిత్రా మసు, నిలీమా ఇద్దరూ వైద్యులే కావడంతో, ఆమె కూడా చిన్ననాటి నుంచి వైద్య రంగంలోకి రావాలని ఎంతో కలలు కన్నారు. 2017లో ప్రపంచ సుందరి (Miss World) కిరీటాన్ని కైవసం చేసుకున్న ఆ తర్వాత, బాలీవుడ్ నుంచి వరుస అవకాశాలు రావడంతో వైద్య విద్యను మధ్యలోనే వదిలిపెట్టి సినిమాల్లోకి అడుగుపెట్టారు. అయితే తాజాగా ఆమె తన గతం తాలూకు చేదు అనుభవాలను పంచుకుంటూ తాను కూడా నీట్ పేపర్ లీక్ బాధితురాలినేనని వెల్లడించారు.
తాజాగా ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న మానుషి చిల్లర్, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) ప్రశ్నపత్రం లీక్ ఘటనపై స్పందించారు. 2015లో తాను నీట్ పరీక్ష రాస్తున్న సమయంలో పేపర్ లీక్ కావడంతో, పరీక్ష రద్దై తాను మళ్లీ రాయాల్సి వచ్చిందని గుర్తుచేసుకున్నారు. డాక్టర్ కావాలనే తన కలను సాకారం చేసుకోవడానికి తాను ఎంతో కష్టపడ్డానని, పేపర్ లీక్ కావడంతో అప్పట్లో తన జీవితంలో అత్యంత కఠినమైన దశను ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికీ విద్యార్థులు ఇలాంటి దుస్థితిని, కఠిన పరిస్థితులను ఎదుర్కోవడం ఎంతో బాధాకరమని ఆమె పేర్కొన్నారు.
తన అనుభూతిని వివరిస్తూ.. ‘‘నాకు చిన్ననాటి నుంచి కూచిపూడి నృత్యం, పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. కానీ నీట్ ప్రవేశ పరీక్ష కోసం వాటిని ఏడాది పాటు పూర్తిగా పక్కన పెట్టాను. నిద్రలేకుండా ఎంతో కష్టపడి ప్రిపేర్ అయ్యాను. సరిగ్గా పరీక్ష సమయానికి పేపర్ లీక్ అయిందని తెలిసి ఎంతో కుంగిపోయాను. నెలల తరబడి చదివిన కష్టం బూడిదైనట్లైంది. ఆ తర్వాత మళ్లీ మరో 45 రోజులు తీవ్రంగా శ్రమించి చదవాల్సి రావడంతో మానసికంగా తీవ్రమైన ఒత్తిడికి, ఆందోళనకు గురయ్యాను. ఆ సమయంలో నా తల్లిదండ్రులు నాకు ఎంతో ధైర్యం చెప్పారు. వారి అండదండలతోనే మళ్లీ పరీక్ష రాసి అర్హత సాధించగలిగాను. కానీ అందరి తల్లిదండ్రులు అలా స్పందించలేకపోవచ్చు. వేరే రాష్ట్రాల నుంచి వచ్చి హాస్టళ్లలో ఉంటూ చదువుకునే నా తోటి విద్యార్థులు ఆ సమయంలో పడిన మానసిక వేదన వర్ణనాతీతం’’ అంటూ మానుషి నాటి రోజులను తలచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ‘సామ్రాట్ పృథ్వీరాజ్’, ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’, ‘ఆపరేషన్ వాలంటైన్’, ‘టెహ్రాన్’ వంటి చిత్రాల్లో నటించి మెప్పించారు మానుషి.
