ఆకస్మికంగా మృతిచెందిన ప్రముఖ నటి శ్రీదేవి భౌతికకాయాన్ని స్వదేశానికి తరలించే విషయంలో మంగళవారం ఎట్టకేలకు ముందడుగు పడింది. దుబాయ్ పోలీసులు శ్రీదేవి భౌతికకాయాన్ని తమ అధీనంలోంచి విడుదల చేసేందుకు అనుమతిస్తూ.. దుబాయ్లోని భారత రాయబార కార్యాలయానికి, ఆమె భర్త బోనీ కపూర్కు లేఖలు అందించారు. దీంతో శ్రీదేవి భౌతికకాయాన్ని ఎంబామింగ్ చేసి.. తరలించే ప్రక్రియ ప్రారంభమైంది.
దీంతో ఆమెను అక్కడి నుంచి కాసేపట్లో ముంబయికి తరలించనున్నారు. ప్రస్తుతం శ్రీదేవి భౌతిక కాయానికి రసాయన ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.ఆ తరువాత ఆమెను ప్రత్యేక విమానంలో ముంబయి తీసుకురావడానికి దాదాపు 4 గంటలు పడుతోంది.
54 ఏళ్ల శ్రీదేవి గత శనివారం రాత్రి దుబాయ్లో ఆకస్మికంగా మృతిచెందిన సంగతి తెలిసిందే. గత రెండురోజులుగా ఆమె భౌతికకాయం దుబాయ్ పోలీసుల అధీనంలోనే ఉంది. ఆమె ఆకస్మిక మృతిపై దుబాయ్ పోలీసులు, పబ్లిక్ ప్రాసిక్యూషన్ విభాగం విచారణ జరిపాయి. శ్రీదేవి బాత్టబ్లో మునిగి చనిపోయారని,ఆ సమయంలో ఆమె స్పృహలో లేరని ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆమె మృతి వెనుక ఎలాంటి నేరిపూరిత కోణం కనిపించడం లేదని పేర్కొంది. శ్రీదేవి ప్రమాదవశాత్తుగా నీళ్లలో మునిగి మృతి చెందారని అక్కడి ఆరోగ్య శాఖ పేర్కొన్న విషయంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.