కొత్త ఛైర్మన్‌ వచ్చారు.. కూత మొదలు..!

రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ సునీత్‌శర్మను రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌, సీఈవోగా ఎంపికచేసింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను సునీత్‌కు అప్పగించారు. సునీత్‌ శర్మ 1978 బ్యాచ్‌కు చెందిన స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటిస్‌ అధికారి.

భారతీయ రైల్వే సంస్థలో ఆయన దాదాపు 34ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. సాంకేతిక అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతో పాటు పనిచేసిన విభాగాల్లో కొన్ని పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. రాయ్‌బరేలీలోని మోడర్న్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి జనరల్‌ మేనేజర్‌గానూ సేవలందించారు. అంతేకాకుండా సెంట్రల్‌ రైల్వేలో పుణె డీఆర్‌ఎంగా, చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌గా, వారణాసిలోని డీజిల్‌ లోకోమెటివ్‌ వర్క్స్‌లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. విదేశాల్లో జరిగిన పలు రైల్వే సంస్థల శిక్షణా కార్యక్రమాలకూ ఆయన హాజరయ్యారు.