ఇంగ్లాండ్తో జరగనున్న చివరి రెండు టెస్టులకు భారత జట్టులో రెండు అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. టెస్టుల్లో విఫలమయిన మురళీ విజయ్, కుల్దీప్ యాదవ్లపై వేటు వేశారు సెలెక్టర్లు. వీరిస్థానంలో అండర్-19 ప్రపంచకప్ను భారత్కు అందించిన యువ సంచలనం, కెప్టెన్ పృథ్వీషా, హైదరాబాద్ ఆటగాడు హనుమ విహారీలకు జాతీయ జట్టులో చోటు దక్కించుకున్నారు. చివరి రెండు టెస్టుల్లో వీరిద్దరూ ఆడనున్నారు.
18 ఏళ్ల పృథ్వీషా ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు. అద్భుత ఆటతీరుతో భారత్కు ప్రపంచకప్ అందించాడు. చివరి రెండు టెస్టులకు ఓపెనర్ మురళీ విజయ్, బౌలర్ కుల్దీప్ యాదవ్లను జట్టు నుంచి తప్పించారు. మురళీ విజయ్ గత 11 ఇన్నింగ్స్లలో సింగిల్ డిజిట్ స్కోరుకే పరిమితం కావడంతో అతడిపై వేటేశారు. ఇక రెండో టెస్టులో కుల్దీప్ యాదవ్ ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. దీంతో వీరిద్దరినీ తప్పించిన మేనేజ్ మెంట్.. వారి స్థానాల్లో పృథ్వీ షా, హనుమ విహారీలను తీసుకుంది.
భారత టెస్టు జట్టుకి ఎంపికైన మూడో ఆంధ్ర ప్లేయర్గా హనుమ విహారి రికార్డ్ క్రియేట్ చేశాడు. సీకే నాయుడు, ఎమ్మెస్కే ప్రసాద్ తర్వాత భారత టెస్టు జట్టుకు ఎంపికైంది హనుమ విహారి మాత్రమే. చక్కటి డిఫెన్స్, మంచి టెక్నిక్ అతడి బలం. హనుమ విహారి 2010లో హైదరాబాద్ తరఫున రంజీల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకూ 63 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడిన అతడు 59.79 సగటుతో 5142 పరుగులు చేశాడు. అందులో 15 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.