శ్రీలంకతో మొహాలి వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో భారత్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. రెండో వన్డేల్లో భారత ఓపెనర్ రోహిత్ శర్మ సెంచరీతో లంకపై కసి తీర్చుకున్నాడు. తొలి మ్యాచ్లో దారుణంగా విఫలమై కెప్టెన్గా చెత్త రికార్డు మూటగట్టుకున్న రోహిత్ అంతకంతకు లంక బౌలర్లపై బదులు తీర్చుకున్నాడు.
కెప్టెన్ రోహిత్ శర్మ (100 నాటౌట్: 115 బంతుల్లో 9×4, 1×6) అజేయ శతకంతో చెలరేగాడు. తొలి వన్డేలో కేవలం రెండు పరుగుల వ్యక్తిగత స్కోరు వద్దే ఔటై నిరాశపరిచిన రోహిత్ శర్మ తాజా వన్డేలో క్రీజులో కుదురుకునే వరకూ నెమ్మదిగా ఆడి అనంతరం గేర్ మార్చి వరుస బౌండరీలు బాదేశాడు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ వేసిన లక్మల్ బౌలింగ్లో మిడాఫ్ దిశగా తన స్టైల్ బౌండరీతో జోరు అందుకున్న ఈ కెప్టెన్ తొలి వికెట్కి శిఖర్ ధావన్ (68: 67 బంతుల్లో 9×4)తో కలిసి అభేద్యంగా 115 పరుగుల భాగస్వామ్యంతో జట్టు భారీ స్కోరుకి బాటలు వేశాడు.
కెప్టెన్గా రోహిత్ శర్మకి ఇది తొలి శతకం కాగా.. వన్డేల్లో 16వ శతకం కావడం విశేషం. అతనితో పాటు క్రీజులో ప్రస్తుతం శ్రేయాస్ అయ్యర్ (61 నాటౌట్: 55 బంతుల్లో 6×4, 1×6) ఉన్నాడు. వీరిద్దరూ రెండో వికెట్కి 122 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కొనసాగుతుండటంతో భారత్ జట్టు 39.3 ఓవర్లు ముగిసే సమయానికి 247/1తో నిలిచింది.