22 సంవత్సరాల తర్వాత వరల్డ్ వేయిట్ లిప్టింగ్ చాంపియన్ షిప్లో భారత వెయిట్లిఫ్టర్ మీరాబాయి చాను చరిత్ర సృష్టించింది. కరణం మల్లీశ్వరి తర్వాత వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించిన రెండో భారతీయురాలిగా రికార్డు నెలకొల్పింది.
ఆమె ఏకంగా 194 కిలోల బరువెత్తి జాతీయ స్థాయిలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 48 కిలోల విభాగంలో పోటీ పడిన మీరాబాయి స్నాచ్ విభాగంలో 85 కిలోలు, క్లీన్ అండ్ జెర్క్లో 109 కిలోల బరువు ఎత్తింది. 1995 తర్వాత వరల్డ్ ఛాంపియన్స్లో భారత్ సాధించిన తొలి పతకం ఇదే కావడం విశేషం. ఆ ఏడాది చైనాలో జరిగిన పోటీల్లో తెలుగు తేజం కరణం మల్లీశ్వరి పసిడి పతకం గెలుపొందింది.
వరల్డ్ ఛాంపియన్షిప్లో స్వర్ణం సాధించడం వెనుక కోచ్ విజయ్ శర్మ పాత్ర ఎంతో ఉందని మీరాబాయి తెలిపింది. పతకం కోసం కోచ్తో కలిసి ఎంతో శ్రమించానని చెప్పింది. 2020లో టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్లోనూ తప్పకుండా పతకం సాధిస్తాననే ఆశాభావాన్ని మీరాబాయి వ్యక్తం చేసింది.
మణిపూర్కు చెందిన చాను ప్రస్తుతం భారతీయ రైల్వేలో పని చేస్తోంది. వరల్డ్ ఛాంపియన్షిప్లో చాను తొలి స్థానంలో నిలవగా.. థాయ్లాండ్కు చెందిన సక్చారోఎన్ థున్యా రజత పతకం సాధించింది. డోపింగ్ కారణాల రీత్యా ఈ పోటీలకు రష్యా, చైనా, కజకిస్థాన్, ఉక్రెయిన్, అజర్ బైజాన్ దేశాలు దూరంగా ఉండటం మీరాబాయికి కలిసి వచ్చింది.