కామన్వెల్త్ క్రీడల్లో తొలిరోజు భారత వెయిట్లిప్టర్లు పతకాల పంట పండిస్తున్నారు. పురుషుల వెయిట్ లిఫ్టింగ్ 56 కేజీల విభాగంలో గురురాజా రజత పతకంతో భారత్కి తొలి పతకాన్ని అందించగా.. మీరాబాయి చాను స్వర్ణ పతకంతో సత్తా చాటింది. తద్వారా ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డు నెలకొల్పింది.
వెయిట్ లిఫ్టింగ్ 48 కేజీల విభాగంలో పోటీ పడ్డ చానూ, మిగతావారికన్నా మిన్నగా రాణించి స్వర్ణపతకాన్ని ఎగరేసుకుపోయింది. ఈ పోటీల్లో ఇండియాకు లభించిన తొలి స్వర్ణ పతకం ఇదే. స్నాచ్ విభాగంలో తన మూడు అటెంప్ట్ లలో వరుసగా 80, 84, 86 కిలోల బరువును ఎత్తిన ఆమె, క్లీన్ అండ్ జర్క్ విభాగంలో వరుసగా 103, 107, 110 కిలోల బరువును ఎత్తింది. మొత్తంగా 196 కిలోల బరువును ఎత్తిన ఆమె, కామన్వెల్త్ రికార్డును నెలకొల్పింది.
గతంలో గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో మీరాబాయి రజతం సాధించింది. గత ఏడాది నవంబర్లో జరిగిన వెయిట్లిఫ్టింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్లో మీరాబాయి స్వర్ణం సాధించింది. తద్వారా కరణం మల్లీశ్వరీ తర్వాత ఈ ఘనత సాధించిన భారతీయ మహిళా వెయిట్లిఫ్టర్గా రికార్డు నెలకొల్పింది.