భారత్ జట్టు సఫారీ గడ్డపై పర్యటనకు సిద్దమైంది. జనవరి 5 నుంచి టీమిండియా మూడు టెస్టులు, ఆరు వన్డేలు, మూడు టీ20ల సుదీర్ఘ సిరీస్ని సఫారీ గడ్డపై ఆడనుంది. గత కొంతకాలంగా తిరుగులేని ప్రదర్శనతో వరుస టెస్టు సిరీస్ విజయాలు సాధిస్తోంది భారత్. సఫారీ గడ్డపై భారతజట్టు రానిస్తుందని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
ఇప్పటి వరకు ఆ గడ్డపై టీమిండియాకు మెరగైన రికార్డులేదు. ఒక టెస్టు సిరీస్ని కూడా టీమిండియా గెలవలేకపోయింది. దీంతో ఈ సిరీస్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న భారత్కి కొత్తగా తుది జట్టు ఎంపికలో ఓ తీపి తలపోటు వచ్చింది.
భారత సెలక్టర్లు ఇటీవల 17 మందితో కూడిన జట్టుని దక్షిణాఫ్రికా పర్యటన కోసం ప్రకటించారు. అయితే.. ఈ జట్టులోనే మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ రూపంలో ముగ్గురు ఓపెనర్లు ఉండటంతో తుది జట్టు ఎంపిక ఎలా..? అనే దానిపై టీమిండియా మేనేజ్మెంట్ చర్చిస్తోంది.
శ్రీలంక పర్యటన ముందు వరకు కొంతకాలం టెస్టు జట్టులో రెగ్యులర్ ఓపెనర్లుగా మురళీ విజయ్, కేఎల్ రాహుల్ ఉన్నారు. కానీ.. ఈ పర్యటనకి భారత్ వెళ్లే కొద్ది రోజుల ముందు విజయ్ గాయపడటంతో.. అతని స్థానంలో శిఖర్ ధావన్ని పంపించారు. అక్కడ భారీ శతకం బాదిన ధావన్.. జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు.
గాయం నుంచి కోలుకున్న మురళీ విజయ్కి గత నవంబరులో శ్రీలంకతో టెస్టు సిరీస్లో అవకాశం కల్పించగా.. అతనూ శతకంతో సత్తాచాటాడు. దీంతో శిఖర్ ధావన్, మురళీ విజయ్ ఓపెనర్లుగా దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇన్నింగ్స్ని ఆరంభించే అవకాశం ఉందని ఒక వాదన వినిపిస్తోంది.
వన్డే, టీ20లతో పోలిస్తే.. టెస్టుల్లో కేఎల్ రాహుల్ మెరుగ్గా ఆడతాడంటూ గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. ప్రత్యర్థి పేసర్ల లయని ఆదిలోనే దెబ్బతీయడంలో కూడా రాహుల్ ముందుంటాడు. దీంతో ఎవరికి ఓపెనర్లుగా అవకాశం దక్కుతుందో అనే ఆసక్తి ప్రస్తుతం సర్వత్రా నెలకొంది.