ప్రస్తుతం కరోనా వైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికి పోతున్నాయి. ముఖ్యంగా అధిక జనాభా ఉన్న భారత దేశంలో కరోనా మొదటి దశ కంటే రెండో దశ ప్రజలపై చాలా తీవ్రంగా ప్రభావం చూపిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు, వేల సంఖ్యలో మరణాలు నమోదు అవుతున్నాయి. ఇలాంటి తరుణంలో వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు వారాంతపు లాక్డౌన్లు, నైట్ కర్వ్యూ విధించాయి.
భారత దేశంలో కరోనా తీవ్రత దృష్ట్యా వివిధ దేశాలు భారతీయ ప్రయాణికులపై ఆంక్షలు విధించాయి. అందులో భాగంగా మాల్దీవుల సర్కారు కూడా తాజగా భారత్ నుంచి తమ దేశానికి వచ్చే టూరిస్ట్, ప్రయాణికులపై నిషేధం విధిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆంక్షలు ఈ నెల 27వ తేదీ నుంచి అమలులోకి వస్తున్నట్లు స్పష్టం చేసింది.మాల్దీవుల సర్కార్ నిర్ణయం పై నెటిజన్లు రకరకాలుగా సెటైర్లు వేసుకుంటున్నారు. దానికి కారణం ఇదే.. మాల్దీవుల్లో బాలీవుడ్ సెలబ్రిటీలు అంటూ నిత్యం సోషల్ మీడియాలో హల్ చల్ చేయడం ఈ మధ్య పరిపాటిగా మారింది.
ప్రస్తుతం మరోసారి సెలబ్రిటీలపై నెటిజన్లు సెటైర్లు వేయడం ప్రారంభించారు. మాల్దీవులలో ఇంతకాలం బాగా ఎంజాయ్ చేశారుగా.. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు.. ఏ ఫొటోలు పోస్ట్ చేస్తారు’.. ‘అయ్యో ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారేమో.. ఇప్పుడు ఎలా’ అంటూ నెటిజన్లు సెలబ్రిటీలను ట్రోల్ చేస్తున్నారు. ఇంకొందరు కొన్ని ఫన్నీ ఎక్స్ప్రెషన్స్తో ఉన్న మీమ్స్లో వీళ్లని ట్యాగ్ చేస్తూ.. ఆడుకుంటున్నారు. ఇలా వారి పై వచ్చే ఫన్నీ కామెంట్స్ తో కొందరు నెటిజన్లు నవ్వుకుంటున్నారు.