దక్షిణాది సినీ పరిశ్రమ ఎంతగానో ఎదురుచూసే ‘సైమా అవార్డ్స్-2026’ (SIIMA Awards 2026) వేడుక అత్యంత వైభవంగా ప్రారంభమైంది. బెంగళూరులోని ప్రఖ్యాత కోరమంగళ ఇండోర్ స్టేడియం ఈ వేడుకకు వేదికైంది. ఈ అవార్డుల సంబరానికి టాలీవుడ్, శాండ్వుడ్ దిగ్గజ తారలు పెద్ద సంఖ్యలో విచ్చేసి సందడి చేశారు. రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగే ఈ వేడుకలో తొలి రోజు తెలుగు, కన్నడ చిత్రసీమకు సంబంధించిన విజేతలను ప్రకటించారు.
ఈ వేడుకలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా అరుదైన ఘనత సాధించారు. ‘మిరాయ్’ చిత్రంలోని అద్భుత నటనకు గానూ ఆయన ‘ఉత్తమ నటుడు’ అవార్డును సొంతం చేసుకున్నారు. ఈ సినిమా విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా ఈ వేదికపై అవార్డు అందుకోవడం విశేషం. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రంలో నటనకు గానూ ప్రతిభావంతురాలైన ఐశ్వర్య రాజేశ్ ‘ఉత్తమ నటి (క్రిటిక్స్)’ అవార్డును దక్కించుకున్నారు. ఇదే చిత్రానికి గాను బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ ‘ఉత్తమ హాస్యనటుడు’ పురస్కారాన్ని అందుకున్నారు. ఇక కన్నడలో సంచలనం సృష్టించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రానికి గానూ రిషబ్ శెట్టి ఉత్తమ నటుడిగా నిలిచారు.
తెలుగు సినిమా విభాగంలో విజేతలు వీరే:
ఉత్తమ నటుడు: తేజ సజ్జా (‘మిరాయ్’)
ఉత్తమ నటి: ఐశ్వర్య రాజేశ్ (‘సంక్రాంతికి వస్తున్నాం’)
ఉత్తమ సహాయ నటుడు: సత్యదేవ్ (‘కింగ్డమ్’)
ఉత్తమ సహాయ నటి: శ్రద్ధా శ్రీనాథ్ (‘డాకు మహారాజ్’)
ఉత్తమ హాస్య నటుడు: బుల్లిరాజు (‘సంక్రాంతికి వస్తున్నాం’)
ఉత్తమ సినిమాటోగ్రఫీ: కార్తిక్ ఘట్టమనేని (‘మిరాయ్’)
ఉత్తమ నేపథ్య గాయకుడు: రమణ గోగుల (‘సంక్రాంతికి వస్తున్నాం’)
ఉత్తమ నేపథ్య గాయని: సమీరా భరద్వాజ్ (‘కోర్ట్’)
ఉత్తమ నటుడు (పరిచయ): హర్ష్ రోషన్ (‘కోర్ట్’)
ఉత్తమ నటి (పరిచయ): శ్రీదేవి (‘కోర్ట్’), సాక్షి మడోల్కర్ (‘మోగ్లీ’)
ఉత్తమ గేయ రచయిత: పూర్ణా చారి (‘కోర్ట్’)
ఈ వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు మంచు మనోజ్ తన కుటుంబంతో కలిసి పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అవార్డులు గెలుచుకున్న నటీనటులకు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు.

