ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నా కొన్ని నియోజకవర్గాల్లో వర్గపోరు తప్పడం లేదు. ఇందులో ఒకటి పెందుర్తి. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన మరుసటి రోజు నుండే మొదలైన పంచాయతీ ఇప్పటికి తేలడం లేదు. విశాఖ నగరంలో పెందుర్తి నుండి జనసేన ఎమ్మెల్యే రమేశ్ బాబు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే పేరుకే ఎమ్మెల్యే అయినా ఆయన పరపతి పెందుర్తిలో పనిచేయడం లేదు. ఇదే విషయాన్ని బహిరంగంగానే వెళ్లడించారు ఎమ్మెల్యే రమేశ్ బాబు.
ఎందుకంటే రమేశ్ బాబుకు కంట్లో నలుసులాగా మారారు టీడీపీ సీనియర్ నేత బండారు సత్యానారాయణ మూర్తి,విశాఖ జిల్లా పార్టీ అధ్యక్షుడు గండి బాబ్జీ . నియోజకవర్గంలో ఏ చిన్న పనైనా వీరి కనుసన్నల్లోనే నడుస్తోంది. దీంతో విసిగిపోయిన ఎమ్మెల్యే పంచకర్ల రమేశ్ బాబు..ఇటీవలె తన ఇద్దరు గన్మెన్లను వెనక్కి పంపేశారు కూడా.
బాబ్జీకి అండగా మార్గాని భరత్ ఉండగా మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ సైతం పెందుర్తి వేదికగానే రాజకీయాలు చేస్తున్నారు. దీంతో స్థానికంగా త్రిముఖ పోరు నెలకొంది. ఇద్దరు టీడీపీ నేతలు తన నియోజకవర్గంపై పెత్తనం చెలాయించడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు జనసేన ఎమ్మెల్యే రమేశ్బాబు. పొత్తు ధర్మాన్ని పాటించడం లేదని పవన్ కళ్యాణ్ దృష్టికి ఈ సమస్యను తీసుకువెళ్లారట. అయితే వేచిచూసే ధోరణిలో ఉండాలని జనసేనాని సూచించడంతో లోలోపల రగిలిపోతున్నారు రమేశ్ బాబు. దీంతో పెందుర్తిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక రెండు పార్టీల కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. మొత్తంగా పెందుర్తి పాలిటిక్స్…కూటమి ప్రభుత్వంలో ముసలానికి తొలి అడుగు పడిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.