హైదరాబాద్ లోని అత్తపూర్ లో ఈ రోజు ఉదయం దారుణ హత్య చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. నలుగురు వ్యక్తులు రమేష్ను మారణాయుధాలతో విచక్షణా రహితంగా హతమార్చారు. అయితే దీని వెనుక అక్రమ సంబంధమే కారణమని తెలుస్తోంది.
గతేడాది మహేశ్ గౌడ్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో నిందితుడిగా ఉన్న రమేశ్ ను రోడ్డుపై కత్తులు, గొడ్డళ్లతో దాడిచేసి కిరాతకంగా హతమార్చారు. తాజాగా ఈ దాడికి పాల్పడింది మహేశ్ కుటుంబీకులేనని తేలింది. జుమ్మేరాత్ బజార్ లో చనిపోయిన మహేశ్ గౌడ్ కిరాణా షాపును నడుపుకునేవాడు. అక్కడే ఉంటున్న రమేశ్ కు ఓ వివాహిత మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. దీన్ని పసిగట్టిన మహేశ్ తన కోరికను కూడా తీర్చాలని సదరు మహిళను వేధించాడు. దీంతో సదరు వివాహిత ఈ విషయాన్ని రమేశ్ దృష్టికి తీసుకెళ్లింది.
రమేష్ మహేశ్ గౌడ్ను ఎన్ని సార్లు హెచ్చరించినా ఫలితం లేకపోవడంతో హత్య చేసేందుకు ప్లాన్ వేశాడు. గతేడాది డిసెంబర్ లో పార్టీ చేసుకుందామంటూ మహేశ్ గౌడ్ ను రమేశ్ శంషాబాద్ వరకూ కారులో తీసుకెళ్లాడు. స్నేహితుల సాయంతో అక్కడే గొంతుకోసి కిరాతకంగా హత్యచేశాడు. అనంతరం మృతదేహాన్ని ఎవ్వరూ గుర్తు పట్టకుండా పెట్రోల్ పోసి తగలబెట్టాడు.
ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు రమేశ్ ను నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో నేడు విచారణకు హాజరై తిరిగివస్తుండగా, మహేశ్ కుటుంబీకులు వెంటపడి మరీ రమేశ్ ను నరికి చంపారు. రమేశ్ ను నరికిన తర్వాత మహేశ్ తండ్రి గాల్లోకి చేతులు ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు.
రమేష్ ను హత్య చేసిన తర్వాత మహేష్ గౌడ్ తండ్రితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కూడ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. మహేష్ను హత్య చేసినందుకే రమేష్ ను హత్య చేసినట్టుగా నిందితులు చెప్పినట్టు సమాచారం.