రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ గా ఎన్డీయే కూటమిలోని జేడీయూ అభ్యర్థి హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. ఈ ఉదయం 11 గంటలకు రాజ్యసభ ప్రారంభమైన తరువాత వెంకయ్యనాయుడు నామినేషన్లు వేసిన హరివంశ్, హరిప్రసాద్ పేర్లను ప్రకటించి ఓటింగ్ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్టు తెలిపారు.
ఎన్డీఏ అభ్యర్ధిగా బరిలో నిలిచిన హరివంశ్ నారాయణ్ కు 115 ఓట్లు, హరిప్రసాద్ కు 89 ఓట్లు వచ్చాయి. సభలో మొత్తం 206 మంది ఉండగా, ఇద్దరు ఎంపీలు ఎవరికీ ఓటు వేయలేదు. దీంతో హరివంశ్ నారాయణ్ విజయం సాధించారని ప్రకటించారు. ఆపై ఆయనకు పలువురు సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు.
గురువారం నాడు రాజ్యసభ ఛైర్మెన్ వెంకయ్యనాయుడు తీర్మానాల ద్వారా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికను నిర్వహించారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మెన్ ఎన్నికల్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతును ప్రకటించింది.
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ అభ్యర్థి బీకే హరిప్రసాద్, ఎన్డీఏ అభ్యర్థిగా హరివంశ్ నారాయణసింగ్ పోటీ చేశారు. అయితే ఈ ఎన్నికలకు ఆప్, వైసీపీ దూరంగా ఉన్నాయి. అధికారపక్షం తరుపున4, విపక్షం తరపున 5 తీర్మానాలు ప్రవేశపెట్టారు.