పుల్వామా ఉగ్రదాడికి మించిన మరోదాడి చేస్తామని జైషే మహమ్మద్ సంస్థ ప్రకటనలు.. మరో భారీ విధ్వంసానికి ఉగ్రవాదులు ప్రణాళికలు రచిస్తున్నారంటూ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు.. 40 మంది సైనికులు అమరులయ్యారు.. ఇప్పటివరకు ఏం చేశారు? అని దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ప్రశ్నలకు 21 నిమిషాల్లో సమాధానం చెప్పింది ఇండియన్ ఎయిర్ ఫోర్స్. మరిన్ని ఉగ్రదాడులకు సిద్ధంగా ఉన్న 300 మంది ఉగ్రవాదులు మరణించినట్టు తెలుస్తోంది.
పీఓకేలోని బాలాకోట్ ప్రాంతంలోని ఉగ్రవాద శిబిరంపై తెల్లవారుజామున 3.45 గంటల నుంచి 3.53 గంటల మధ్య తొలి దాడి జరిగింది. బాలాకోట్కు చేరిన మూడు నిమిషాల వ్యవధిలో మరో నాలుగు విమానాలు ముజఫరాబాద్ కు వెళ్లాయి. అక్కడి ఉగ్రవాద శిబిరంపై 3.48 గంటల నుంచి 3.58 గంటల మధ్య దాడులు జరిగాయి. ఇక చకోటీ ప్రాంతానికి వెళ్లిన ఫైటర్ జెట్స్ 3.58 నుంచి 4.04 గంటల మధ్య బాంబుల వర్షం కురిపించాయి. ఆపై 4.12 నుంచి 4.15 గంటల కెల్లా అన్ని విమానాలూ తిరిగి ఎయిర్ బేస్ కు చేరుకున్నట్టు తెలుస్తోంది.
సర్జికల్ స్ట్రయిక్స్ నేపథ్యంలో ఎల్ఓసీ వెంట తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దుల్లో పాకిస్థాన్ యుద్ధ విమానాల కదలికలను గుర్తించిన ఆర్మీ.. హుటాహుటిన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను సిద్ధం చేస్తోంది. పాకిస్థాన్ ఫైటర్ జెట్స్ భారత భూభాగంలోకి ప్రవేశిస్తే, వాటిని వెంటనే కూల్చేందుకు యాంటీ ఎయిర్క్రాఫ్ట్ మిసైల్స్ను మోహరిస్తోంది. మరో వైపు సరిహద్దుల్లో జవాన్లను అప్రమత్తం చేసింది. అదనపు విమానాలను, క్షిపణులను మోహరించే పని ప్రారంభించారు. కశ్మీర్లో కూంబింగ్ను తీవ్రతరం చేశారు. ఇంటా, బయట ఎలాంటి దాడినైనా ఎదుర్కోనేందుకు భారత్ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు దాడులను డైవర్ట్ చేసేందుకు చైనా ప్రయత్నించే అవకాశాలు ఉండటంతో చైనా సరిహద్దుల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. అంతేకాదు సముద్రతీరంలో కూడా హైఅలర్ట్ ప్రకటించింది.