పొద్దున్నే ఇంటి నుంచి బయద్దేరే ముందే వాహనంలో పెట్రోల్, డీజిల్ ఉందో లేదో సరి చూసుకోండి.. లేకుంటే ఇబ్బందలు తప్పవు. సాయంత్రం ఆఫీసు, వ్యాపార కార్యకలాపాలు ముగించుకున్నాక తీరిగ్గా పెట్రోల్ కొట్టించుకుందాంలే అనుకుంటే ఇంతే సంగతులు.. ఎందుకంటే ఇకమీదట సాయంత్రం ఆరు దాటితే పెట్రోలు బంకులు పనిచేయవు.
మే మూడో వారం నుంచి రాష్ట్రంలో పరిమిత గంటల్లో మాత్రమే పెట్రోల్ బంకులు పనిచేయనున్నాయి. మే 15వ తేదీ నుంచి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే ఇవి పనిచేస్తాయి. ఏపీ ఫెడరేషన్ ఆఫ్ పెట్రోలియం ట్రేడర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
దీర్ఘకాలంగా తమ సమస్యలకు పరిష్కారం ఇవ్వని ప్రభుత్వాలకు షాకిచ్చేందుకు సిద్దమయ్యాయి ఏపీ పెట్రోల్ బంకుల యాజమాన్యాలు. ప్రభుత్వ తీరుపై విసిగిన వారు.. ప్రజలకు షాకివ్వటం ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడిని పెంచే కార్యక్రమానికి షురూ పలికారు. గడిచిన ఏడాది ముంబయిలోని చమురు కంపెనీల ఉన్నతాధికారుల సమక్షంలో ఇచ్చిన పదకొండు హామీల అమల్లో జరుగుతున్న ఫెయిల్యూర్ పై పెట్రోల్ బంకు యజమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
డీలర్ మార్జిన్ పెంచే విషయంలో ఎప్పటికప్పుడు వాయిదా వేస్తున్న కంపెనీ తీరు.. ప్రభుత్వ విధానాలపై విసిగిపోయిన వ్యాపారులు.. తమదైన శైలిలో ఒత్తిడి పెంచేందుకురంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా తాజా కార్యాచరణను ప్రకటించారు. మే 15 తర్వాత నుంచి ఏపీలోని పెట్రోల్ బంకులు సరికొత్త విధానాన్ని అనుసరించనున్నట్లుగా వెల్లడించారు. ఇందులో భాగంగా దక్షిణాది రాష్ట్రాలతోపాటు మొత్తం ఎనిమిది రాష్ట్రాల్లో మే 10న అన్ని చమురు కంపెనీల నుంచి పెట్రోల్, డీజిల్ కొనుగోళ్లు నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన ఇంధన పొదుపులో భాగంగా మే 14న ఆదివారం బంకులను పూర్తిగా మూసివేయనున్నట్టు తెలిపారు.
ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మాత్రమే పెట్రోల్ బంకులు పని చేస్తాయని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే మాత్రం.. వాహనదారులకు చుక్కలు కనిపించటం ఖాయం. సమస్య మరింత ముదిరి.. తీవ్రస్థాయిలో విమర్శలు చెలరేగే వరకూ మురగబెట్టే అలవాటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ ఇష్యూ మీద కల్పించుకొని ఒక సొల్యూషన్ వెతికితే మంచిదన్న సూచన పలువురు చేస్తున్నారు. తమ మార్జిన్లపైన ఆయిల్ కంపెనీలు సమీక్షిస్తే పునరాలోచిస్తామని తెలిపారు. మరి ఈఅంశంపై చంద్రబాబు ఏవిధంగ రియాక్టు అవుతారో చూడాలి.
Releated