గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఒక పక్క అధికార పార్టీ తెరాస దూసుకుపోతోంది. వార్డు స్థాయి నుంచి ఎవరు వచ్చినా సరే పార్టీలో చేర్చేసుకుంటోంది. ఇంకోపక్క నాయకులకు కూడా వలలు వేస్తూనే వస్తోంది. ఇదంతా వ్యూహాత్మంగా వేస్తున్న ఎత్తుగడగా చెప్పుకోవచ్చు. నిజానికి, తెరాస టార్గెట్ టీడీపీ అనేది స్పష్టంగా అర్థమౌతోంది.
అందుకే, కొంతమంది పెద్ద నాయకులను కూడా ఇటీవలే కారెక్కించేసింది. ఇప్పటికీ ఆ ప్రక్రియ కొనసాగుతోందనే రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గట్టి దెబ్బ కొట్టడమే లక్ష్యంగా కనిపిస్తోంది. దీంతో తెలుగు తమ్ముళ్లు కాస్త డీలా పడ్డారనే చెప్పాలి. మామూలుగా అయితే ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం పెరుగుతుంది.
కార్యకర్తలను ఉత్తేజపరచి ఎలాగైనా విజయం సాధించాలన్న పట్టుదల అనేది పెరుగుతుంది. కానీ, ప్రస్తుతం గ్రేటర్ తెలుగుదేశం శ్రేణుల్లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికలు దగ్గరకి వస్తున్నకొద్దీ తమ్ముళ్లలో విశ్వాసం సడలుతోందని తెలుస్తోంది.
అందుకే, ఈ పరిస్థితిని కొంతైనా చక్కదిద్ది… క్షేత్రస్థాయి పార్టీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నింపాలన్న ఉద్దేశంతోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో ఒక బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. అయితే, ఆయన సభ ఏర్పాటు చేశారు అనే వార్త కూడా తమ్ముళ్లలో ఉత్సాహం నింపడం లేదని అంటున్నారు.
ఈ నిరుత్సాహానికి గల కారణాలను కూడా వారు ఆఫ్ ద రికార్డ్గా బయటపెడుతున్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్లు ఎప్పటికప్పుడు భేటీ అవుతున్నారని, కేసీఆర్తో మంచిగా ఉండాలని చంద్రబాబు ప్రయత్నిస్తుంటే క్షేత్రస్థాయిలో కేసీఆర్ను మేము విమర్శించి ఏం ప్రయోజనం ఉంటుంది అనేది తమ్ముళ్ల ప్రశ్న.
తెరాస సర్కారు వైఫల్యాలను ఎత్తి చూపి మేం ప్రచారం చేస్తుంటే… పైస్థాయిలో ముఖ్యమంత్రులిద్దరూ ఫ్రెండ్లీగా ఉంటున్నట్టు కనిపిస్తుంటే ప్రయోజనం ఏముంటుందని వారు వాపోతున్నారు. దీంతోపాటు వలసలు పెరగడం కూడా పార్టీ శ్రేణుల్లో నిరుత్సాహాన్ని పెంచుతున్న మరో కారణంగా చెప్పుకోవచ్చు.
పార్టీ తరఫున నేడు బలంగా మాట్లాడుతున్న నాయకులు రేపటికి పార్టీలో ఉంటారా లేదా అనేది తమకు నమ్మకం లేకుండా పోయిందనే ధోరణి కూడా కొంతమంది కార్యకర్తల్లో ఉందని అంటున్నారు.