కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార…ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వైసీపీ అధినేత జగన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాకినాడకు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే మురిగిపోయినట్టేనని, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఓటర్లను కోరారు.
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ ఓటు మురిగిపోతుందని చంద్రబాబు చెప్పారని, కానీ టిడిపికి ఓటు వేస్తేనే మురిగిపోతుందనే విషయం ఆయనకు తెలియదని జగన్ కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు తన పాలనలో చేసిందేమీ లేదన్నారు. బెల్టు షాపులు మూసేస్తానని వీధివీధికో షాపు పెట్టారన్నారు.
ఏడాదిలో లేదా ఏడాదిన్నరలోపే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు స్వయంగా నంద్యాలలో చెప్పిన విషయాన్ని జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు ఓటు వేసి వైకాపాను గెలిపిస్తే, ఏడాది తరువాత, రాష్ట్రంలోనూ, ఇక్కడా వైకాపాయే ఉంటుందని, కాకినాడలో అభివృద్ధి అంటే ఏమిటో తాను చేసి చూపిస్తానని చెప్పారు.
ఎన్నికల్లో ఓట్ల కోసం మాత్రమే చంద్రబాబు అభివృద్ధి మాటలు చెపుతున్నారని విమర్శించిన జగన్, నంద్యాలకు ప్రకటించినట్టుగానే, మిగతా అన్ని అసెంబ్లీలకూ ఎందుకు నిధులు ఇస్తున్నట్టు చెప్పలేదని ప్రశ్నించారు. మూడున్నరేళ్ల చంద్రబాబు పరిపాలనను ప్రజలంతా గమనిస్తూనే వచ్చారని, ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన ఏ ఒక్క హామీ కూడా అమలు కాలేదని ఆరోపించారు.