తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టి రాజన్న రాజ్యం తెస్తానన్న వైఎస్ షర్మిల ప్రకటనపై మంత్రి హరీష్ రావు పరోక్షంగా స్పందించారు. తెలంగాణ గురించి అవగాహన, పరిజ్ఞానం లేని వాళ్లు కూడా విమర్శలు చేసి తమ ప్రభుత్వాన్ని ప్రశ్నిన్నారని హరీష్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా కంది గ్రామంలో రైతు వేదికను ప్రారంభించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ…
ఎవరో వచ్చి తెలంగాణలో రైతులకు ఏం న్యాయం జరిగిందని ప్రశ్నిస్తున్నారని, రైతులకు బాగు కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. ఏపీలో రైతులకు కేంద్రం ఇచ్చే డబ్బులతో కలిపి భూమి ఎంత ఉన్నా రూ. 12.500 మాత్రమే ఇస్తున్నారని, అదే తెలంగాణలో ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు ఎకరానికి 10వేల చొప్పున రైతుబంధు ఇస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. అవేవీ తెలుసుకోకుండా ఇక్కడికొచ్చి మొసలి కన్నీరు కారుస్తున్నారని హరీష్ విమర్శించారు.
అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా? అని షర్మిలను ఉద్దేశించి మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఇదిలావుండగా షర్మిల పార్టీ ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. అయితే తెలంగాణలో కొత్త పార్టీకి అవకాశం లేదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇక తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి హరీష్ రావు ఇచ్చిన కౌంటర్ను వైఎస్ షర్మిల ఎలా తిప్పికొడతారో చూడాలి!
Also Read
తెలంగాణలో షర్మిల పార్టీ.. ప్రభావం ఎంత?!
టీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్.. మాజీ ఎమ్మెల్సీ రాజీనామా
బ్రౌన్ రైస్ తో ఎంతో మంచి ఆరోగ్యం!