ఈ నెల 17న నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన సంగతి తెలిసిందే. దేశంలో నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం అసెంబ్లీలకు ఎన్నికలు ముగియడంతో వరుసగా ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్నాయి. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో నాగార్జునసాగర్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల నర్సింహయ్య గెలుపొందారు. అయితే ఇటీవల నోముల అనారోగ్యంతో మృతి చెందడంతో ఈ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది.
అయితే ఏప్రిల్ 17న పోలింగ్ జరగ్గా టీఆర్ఎస్ నుంచి నోముల భగత్, కాంగ్రెస్ నుంచి జానారెడ్డి, బీజేపీ నుంచి రవి నాయక్ పోటీలో నిలిచారు. తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ నాగార్జున సాగర్ ఉప ఎన్నిక స్థానాన్ని టీఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని తేల్చి చెప్పేశాయి. సాగర్ ఉప ఎన్నిక ఎగ్జిట్స్ పోల్స్ ఫలితాలను ‘ఆరా’ సంస్థ వెల్లడించింది.
అధికార టీఆర్ఎస్ కే ఓటర్లు మరోమారు పట్టం కట్టినట్టు ‘ఆరా’ తన అంచనాల్లో పేర్కొంది. టీఆర్ఎస్ కు 50.48 శాతం ఓట్లు రాగా, కాంగ్రెస్ కు 39.93 శాతం, బీజేపీకి 6.31 శాతం ఓట్లు వచ్చినట్టు తెలిపింది. కాగా, మిషన్ చాణక్య సర్వేలో టీఆర్ఎస్కు 49.254 శాతం, కాంగ్రెస్ 37.92 శాతం, బీజేపీ 7.80 శాతం, ఇతరులు 5.04 శాతం ఉండగా, ఆత్మసాక్షి సర్వేలో టీఆర్ఎస్కు 43.5 శాతం, కాంగ్రెస్ 39.5 శాతం, బీజేపీ 14.6 శాతం, ఇతరులు 2.4 శాతం వచ్చినట్టు వెల్లడయ్యింది.