కాపు రిజర్వేషన్లు కల్పించాలని మాజీ మంత్రి ముద్రగడ చంద్రబాబుకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఆయన చేస్తున్న పాదయాత్రను ఉక్కుపాదంతో అణిచివేస్తున్నారు. కాకినాడ కార్పొరేషణ్ ఎన్నికల్లో ముద్రగడ ప్రభావం లేదని తేలిపోయింది. అయితే ఇప్పుడు కాపు రిజర్వేషన్లపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి ముచ్చెమటుల పట్టిస్తున్నాయి.
కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని ఏపీ ప్రభుత్వం వాగ్ధానం చేసిందని ఈ సందర్భంగా పవన్ అన్నారు. ఓట్లేస్తే కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారని గుర్తు చేశారు. కాపు రిజర్వేషన్లపై నాన్చొద్దు.. కాపు రిజర్వేషన్ల హామీ కూడా ప్రత్యేక హోదా లాంటిదేనని అన్నారు. ఆలస్యం చేయకుండా ఏపీ ప్రభుత్వం వెంటనే ఇచ్చిన హామీని అమలు చేయాలని పవన్ డిమాండ్ చేశారు. మభ్యపెడితే అశాంతికి కారణమవుతుందని హెచ్చరించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే ఇవ్వండి లేదంటే ఇవ్వలేమని తేల్చి చెప్పాలని ప్రభుత్వానికి సూచించారు.
ముద్రగడను అడ్డుకుంటే.. తాను ఒక కులం కోసం పనిచేయనని, ప్రతి కులాన్ని గౌరవిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న ముద్రగడ పద్మనాభం పాదయాత్రను ఆపే హక్కు పోలీసులకు, ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ముద్రగడను అడ్డుకోవడం శాంతి భద్రతల సమస్యగా మారుతుందన్నారు. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారొ చూడాలి.