తనకు పదే పదే బెదిరింపు కాల్స్, మెసేజ్లు వస్తున్నాయని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను దీనిపై రెండు రోజుల క్రితమే డీజీపీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశానన్నారు. అయినా తనను చంపేస్తామంటూ మెసేజ్లు వస్తూనే ఉన్నాయని రాజాసింగ్ తెలిపారు. తన ఫిర్యాదును పోలీసులు ఎఫ్ఐఆర్ కాపీలకే పరిమితం చేశారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. కమాండ్ కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు స్వీకరించడానికి ఏర్పాటు చేశారా లేక బీజేపీ కాంగ్రెస్ నేతల ఫోన్లను ట్రాకింగ్ చేయడానికి నిర్మించారా అని రాజాసింగ్ ప్రశ్నించారు.
కమాండ్ కంట్రోల్ రూమ్లో ఫిర్యాదులు తీసుకోనప్పుడు దానిని ఎందుకు నిర్మించారన్నారు. దానిని నిర్మించడం ద్వారా ప్రజాధనం దాదాపు 800 కోట్ల రూపాయలు వృధా అయినట్లే అన్నారు. ఆధునిక పోలీస్ వ్యవస్థతో చీమ చిటుక్కుమన్నా పట్టేయ్యోచ్చనే ఉద్దేశంతోనే కదా కేసీఆర్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రంలో సాక్షాత్తు ఎమ్మెల్యేకే భద్రత లేనప్పుడు సాధారణ ప్రజలకు ఎలా రక్షణ ఉంటుందన్నారు.
ఓల్డ్ సిటీలో స్లీపర్ సేల్స్ ఉన్నాయని బెదిరింపుదారులు చెబుతున్నారన్న రాజాసింగ్.. టెర్రరిస్టులకు ఎంఐఎం నాయకుల ఆశీర్వాదం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎం నేతలు టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడటమే ఇందుకు నిదర్శనమన్నారు. ఎంఐఎం నేతలు టెర్రరిస్టులకు అనుకూలంగా మాట్లాడుతన్నా పోలీసులు వారిని ఎందుకు అరెస్టు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.