ఏపీ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటివరకు టీడీపీ – జనసేన పొత్తుగా కలిసి వెళ్తుండగా ఈ కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అన్న సందేహానికి చెక్ పడింది. బీజేపీ అధిష్టానం నుండి గ్రీన్ సిగ్నల్ రావడంతో ఈ కూటమిలో బీజేపీ చేరడం దాదాపు ఖాయమైంది.
పొత్తులో భాగంగా బీజేపీకి 4 నుంచి 5 పార్లమెంట్ స్థానాలు, 8 నుంచి 10 అసెంబ్లీ స్థానాలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ స్థానాల్లో ఇప్పటికే అభ్యర్థులను దాదాపు ఖరారు చేసింది బీజేపీ. పొత్తుపై అఫిషియల్ ప్రకటన వెలువడగానే అభ్యర్థులను ప్రకటించనుంది బీజేపీ.
వాస్తవానికి టీడీపీ – బీజేపీని కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు పవన్. అయితే తొలుత వద్దనుకున్న చంద్రబాబు తర్వాత మనసు మార్చుకుని ఓకే చెప్పడంతో కూటమిలో బీజేపీ చేరడం లాంఛనమే అయింది. రాష్ట్ర బీజేపీ నేతలు కూడా కూటమిలో చేరేందుకు ఉత్సాహం చూపడంతో బీజేపీ అధిష్టానం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇక పొత్తులో భాగంగా బీజేపీకి విశాఖపట్నం, రాజమండ్రి,రాజంపేట,తిరుపతి,నర్సాపురంలలో 4 ఎంపీ స్థానాలు కేటాయించే ఛాన్స్ ఉండగా అసెంబ్లీ స్థానాల విషయానికొస్తే విశాఖ ఉత్తర,విశాఖ తూర్పు ,రాజమండ్రి సిటీ ,పి.గన్నవరం ,కైకలూరు,తిరుపతి ,మదనపల్లె ,శ్రీకాళహస్తి ,గుంటూరు వెస్ట్ స్థానాలు ఇవ్వనున్నారని సమాచారం.
ఇక విశాఖ నుండి జీవీఎల్ నరసింహరావు/ సీఎం రమేశ్, రాజమండ్రి నుండి పురందేశ్వరి, రాజంపేట – నల్లారి కిరణ్కుమార్రెడ్డి / సత్యకుమార్, తిరుపతి – రత్నప్రభ, రిటైర్డ్ ఐఏఎస్ పోటీచేసే అవకాశం ఉండగా విశాఖ ఉత్తర – విష్ణుకుమార్ రాజు, విశాఖ తూర్పు – మాధవ్,రాజమండ్రి సిటీ – సోము వీర్రాజు,పి..గన్నవరం – మానేపల్లి అయ్యాజివేమ,కైకలూరు – కామినేని శ్రీనివాస్,తిరుపతి – భానుప్రకాశ్ రెడ్డి,మదనపల్లె – చల్లా నరసింహారెడ్డి,శ్రీకాళహస్తి – కోలా ఆనంద్,గుంటూరు వెస్ట్ – వల్లూరి జయప్రకాష్ నారాయణ పేర్లు వినిపిస్తున్నాయి.