కర్నాటక రాజకీయాలు ఆటను తలపిస్తున్నాయి. లైఫ్లేకున్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని భాజాపా, లైఫ్ ఉన్నా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేని స్థితిలో కాంగ్రెస్-జేడీఎస్లు ఉన్నాయి. గవర్నర్ మాత్రం పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేస్తారని దేశ వ్యాప్తంగా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది.
సంపూర్ణమెజారిటీ లేకున్నా హడావుడిగా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన యడ్యూరప్ప 15 రోజుల్లో బలనిరూపన చేసుకోవాలని గవర్నర్ సమయం ఇచ్చారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో యడ్డీకి పెద్ద షాక్ ఇచ్చింది సుప్రీమ్ కోర్టు. శనివారం సాయంత్రం 4 గంటలకు బలం నిరూపించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
దీంతో హోటల్ రాజకీయాలు జోరందుకున్నాయి. ఎక్కడ తమ ఎమ్మెల్యేలను భాజాపా లాక్కుంటుందోనని కాంగ్రెస్, జేడీఎస్లకు చెందిన ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. ఇదంతా చూస్తుంటే పేకాటను తలపిస్తోంది. పార్టీలకు ఉన్న బలాలను ఒక సారి గమనిస్తే…104 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలంగా చూసుకుంటే భాజాపా సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. ఇక కాంగ్రెస్కు 78, జేడీఎస్కు 37 మంది ఎమ్మెల్యేల సంఖ్య ఉంది.
జేడీఎస్తో పొత్తున్న బీఎస్పీ నుంచి ఓ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీల కూటమికి 116 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా తమకు మద్దతు ఇస్తారని చెబుతుండటంతో కూటమి బలం 118కి పెరిగింది. ప్రస్తుతం 222 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సభా కార్యకలాపాలు చేపడుతున్నందున సభ్యుల సంఖ్య 221కు తగ్గుతుంది.
ఇక భాజాపా కూడా బలం నిరూపించుకుంటామనే ధీమాతో ఉంది. వారికి కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి కాంగ్రెస్, జేడీఎస్లలోని ఎమ్మెల్యేలకు గాలం వేస్తోంది. ఇక 104 మంది ఎమ్మెల్యేల మద్దతున్న యడ్యూరప్ప బలనిరూపణలో గట్టెక్కాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఇరు పక్షాలు తమకే బలం ఉదంటూ తెరచాటు ప్రయత్నాలు మొదలు పెట్టారు. మరి కర్నాటక రాజకీయ ఆటలో మ్యాజిక్ ఫిగర్కు కావాల్సిన జోకర్ ఎవరికి వస్తాదో … ఎవరు షో కొడతారో దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. మరి ఆటలో చివరకు జోకర్గా ఎవరు నిలుస్తారో చూడాలి.