కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం రనరంగాన్ని తలపిస్తోంది. వైసీపీ నుంచి జగన్…టీడీపీ తరుపున సీఎం చంద్రబాబు రంగంలోకి దిగారు. ఇరు నేతలు రోడ్షోలు, చిన్నపాటి సభలతో దూసుకుపోతున్నారు. అయితే ఇప్పుడు ఐటీ మంత్రి నారాలోకేష్ వ్యవహారం టిడిపిలో పెద్ద చర్చనీయాంశమైపోయింది.
కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో లోకేష్ ఇంత వరకూ ఎంట్రీ ఇవ్వలేదు. ఎప్పుడో నంద్యాల ఉపఎన్నికలో ఒకసారి మాత్రమే కనిపించి మాయమైపోయిన లోకేష్ మళ్ళీ నంద్యల వైపు చూడలేదు. సరేలే ఏదో పనిలో బిజీగా ఉండి ఉంటాడు అందుకే రాలేకపోయాడని పాపం టిడిపి శ్రేణులు సమాధానం చెప్పుకున్నాయ్. సరే, నంద్యాల ఎన్నికైపోయింది.
అదే సమయంలో కాకినాడ ఎన్నిక వచ్చింది కదా? అక్కడ కూడా లోకేష్ కనబడలేదు ఇంతవరకూ. కారణాలు ఏమైఉంటాయి? అదే ఇపుడు పార్టీలో పెద్ద చర్చనీయాంశమైపోయింది. లోకేష్ అంటే మామూలు మంత్రి కాదు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కీలకమైన ఐటి, పంచాయితీరాజ్ శాఖలకు మంత్రి. చంద్రబాబునాయుడుకు కొడుకు, నటసింహం నందమూరి బాలకృష్ణకు స్వయానా అల్లుడు కూడా. ఇన్ని భుజకీర్తులున్న యువకిషోరం ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నట్లబ్బా? ఆదివారంతో ప్రచారం ముగుస్తోంది.
ఎన్నికల ప్రచారానికి ఎందుకు దూరంగా ఉన్నారు. ప్రచారానికి లోకేషే దూరంగా ఉన్నారా? లేక చంద్రబాబే దూరంగా ఉంచారా అన్నది తేలటం లేదు. కారణాలేమైనా గానీ కాకినాడలో లోకేష్ ఎంటర్ కాలేదన్నది వాస్తవం. గతంలో ఆనాలోచిత వ్యాఖ్యలు చేసి విమర్శల పాలయ్యిన సంగతి తెలిసిందే. కాకినాడ ఎన్నికల ప్రచారంలో చినబాబు అనాలోచిత వ్యాఖ్యలు చేటు తెస్తాయనె దూరంగా పెట్టారనె వార్తలు వినిపిస్తున్నాయి.