అసత్యాలు చెప్పడం, మోసాలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నెంబర్ వన్గా నిలిచారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో బాబుపై జగన్ నిప్పులు చెరిగారు.
బీసీలు జడ్జీలు కాకూడదంటూ చంద్రబాబు లేఖలు రాశారు. ఇదీ ఆయనకి బీసీలపై ఉన్న ప్రేమని విమర్శలు గుప్పించారు. తెలంగాణాలో ఎలాగూ టీడీపీ అధికారంలోకి రాదని తెలుసు కాబట్టి…అక్కడ అధికారంలోకి వస్తే బీసీకి ముఖ్యమంత్రి పదవి ఇస్తానని మాయమాటలు చెబుతున్నారన్నారు.
చంద్రబాబు నాయుడు మహానాడులో ఏపీలో అందరికీ మినరల్ వాటర్ అందిస్తున్నామని అన్నారని జగన్ అన్నారు. మీకు మినరల్ వాటర్ అందుతుందా? అని ప్రశ్నించారు. చంద్రబాబు బెల్టు షాపులు రద్దు చేస్తామని కూడా అన్నారని, మినరల్ వాటర్ లేని గ్రామం ఉంది కానీ, బెల్టు షాపులు లేని గ్రామం లేదని విమర్శించారు.
మత్స్యకారులకు వరాల జల్లులు కురిపించారు. వేట విరామ సమయంలో రూ.4వేలు కూడా చంద్రబాబు ఇవ్వలేదు. అలాగే బియ్యప్పుతిప్ప హార్బర్ను పక్కనపెట్టారని విమర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మత్స్యకారులకు కొత్త బోట్లు ఇస్తాం. అంతేకాకుండా వేట విరామ సమయంలో వారికి నెలకు రూ.10వేలు, మత్స్యకారులు ప్రమాదవశాత్తూ చనిపోతే బీమా కింద పది లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తాం. మత్స్యకారులకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాంర. అలాగే బోట్లపై డీజిల్కు సబ్సిడీ ఇస్తాం.’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే నవరత్నాలు పథకాన్ని తీసుకు వస్తాం. నవరత్నాలతో అందరి జీవితాల్లో సంతోషాన్ని నింపుతాం. పేదవాడి కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆరోగ్యశ్రీ పథకం తీసుకువస్తే దాన్ని చంద్రబాబు నిర్వీర్యం చేశారు. మనం అధికారంలోకి రాగానే ఆరోగ్యశ్రీని పునరుద్దరిస్తాం. రూ.వెయ్యి బిల్లు దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపచేస్తాం. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు ఎక్కడైనా సరే ఆపరేషన్ చేయించుకుంటే ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొస్తామన్నారు.
భాజాపాతో నాలుగు సంవత్సరాలు కాపురం చేసి విడాకులు తీసుకున్న తర్వాత బాబుకు ప్రత్యేక హోదా గుర్తుకొస్తాదంటూ సెటైర్లు వేశారు. భాజాపా, టీడీపీలు అధికారం పంచుకున్నప్పుడు కేంద్రాన్ని ప్రత్యేకహోదాపై బాబు ఎందుకు ప్రశ్నించలేదన్నారు. కొత్త పెళ్లికూతురుకోసం వెతుకులాట మొదలు పెట్టినప్పుడు ప్రత్యేకహోదా గుర్తుకొస్తుందాని జగన్ ప్రశ్నించారు.
టీడీపీ మహానాడు అంతా అబద్దాలు, అసత్యాలతో జరిగిందన్నారు. అసత్యాలు చెప్పడం, అబద్దాలు ఆడటంలో చంద్రబాబు నెంబర్ వన్ అని ఎద్దే వ చేశారు.