వైసీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కత్తితో దాడి తెలుగు రాష్ట్రాల్లోనే కాదు యావత్ దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఒక రాష్ట్రానికి ప్రతిపక్షనేతగా ఉన్న వ్యక్తిపై అత్యంత సెక్యూరిటీ ఉన్న ఎయిర్ పోర్ట్ లో ఓ వ్యక్తి దాడి జరగడాన్ని అన్ని పార్టీలు ముక్తకంఠంతో ఖండించాయి.
వైద్యుల సలహాతో వైఎస్ జగన్ 17 రోజులపాటు విశ్రాంతి తీసుకున్నారు. ఆ తర్వాత మళ్లీ విజయనగరం జిల్లా సాలూరులో ఎక్కడ అయితే పాదయాత్ర నిలిపివేశారో అక్కడ నుంచి తిరిగి ప్రారంభించిన పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. దాడిపై వైఎస్ విజయమ్మ స్పందించిన సంగతి తెలిసిందే.
కత్తి దాడి జరిగిన వెంటనే సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు, నేతలు హేలన చేస్తూ మాట్లాడారు. ముఖ్యంగా టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలతో తన కుటుంబం తీవ్రంగా కలత చెందిందని అంతాతీవ్ర మనస్థాపానికి గురయ్యారని జగన్ తన సన్నిహితుల వద్ద వాపోయారట. బాబు అయితే కోడి కత్తి డ్రామా అంటూ సెటైర్లు వేశారు.
రాష్ట్ర ప్రజల చూపు ఈనెల 17న పార్వతీపురంలో జరిగే బహిరంగ సభపైనే పడింది. ఇన్నాల్లు మౌనంగా ఉన్న జగన్ ఏం మాట్లాడతారు అనేది ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో తనపై దాడి ఎలా జరిగింది, దాడి చేసిన నిందితుడి వివరాలు, తెలుగుదేశం పార్టీ చేస్తున్న రాద్ధాంతం, హైకోర్టును ఆశ్రయించాల్సిన అంశం,ఏపీ పోలీసులపై నమ్మకం లేదంటూ వచ్చిన ప్రకటనలపై జగన్ వివరణ ఇవ్వనున్నారు.