బోయవాని వేటుకి గాయపడిన కోకిలలా ఉంది జనసేన అధినేత పవన్ పరిస్థితి. ఈసారి ఎలాగైన అసెంబ్లీలో అడుగుపెట్టాలని చూస్తున్న పవన్ ఇందుకోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టడం ద్వారా ప్రజా గొంతుక అవుతానని భావిస్తున్న పవన్ ఆదిశగా గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఎన్నికలకు రెండు సంవత్సరాలకు ముందే పవన్…బీజేపీతో జతకట్టేశారు. వచ్చే ఎన్నికల్లో ఇద్దరం కలిసి పోటీచేస్తామని చెప్పినా బీజేపీతో కలిసి పోటీ చేస్తే జనసేనకు కలిసి వచ్చే అవకాశం లేదని పవన్ భావిస్తున్నారట. అందుకే టీడీపీ వైపు చూశారు పవన్. చంద్రబాబుకు కూడా కావాల్సింది. శత్రువుకు శత్రవుకు మిత్రువు అయినట్లు వైసీపీని ఓడగొట్టేందుకు ఇద్దరు కలిశారు. చంద్రబాబుకు కూడా వైసీపీని ఢీ కొట్టాలంటే ఒంటరిగా బలం సరిపోదు. అందుకే జనసేనతో జతకట్టడం దాదాపు ఖాయం కాగా ఇందులో బీజేపీని కూడా చేర్చుకోవాలని బాబు భావిస్తున్నారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
ఇంతవరకు బాగానే ఉన్నా ఇక ఈ సారి మెజార్టీ స్ధానాలు సాధించి ఏపీ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న పవన్కు నిరాశే ఎదురవుతుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే పలుమార్లు పవన్ – బాబు భేటీ జరుగగా చంద్రబాబు ముందు జనసేన అభ్యర్ధుల జాబితాను ఉంచారట పవన్. అయితే జనసేన అడుగుతున్న స్థానాలను చూసి చంద్రబాబు ఖంగుతిన్నారట. ఎందుకంటే జనసేన అడుగుతోంది 50 స్ధానాలకు పైనే. దీంతో జనసేన- టీడీపీ పొత్తుపై నేతలెవరు మాట్లడవద్దని అంతా తానే చూసుకుంటానని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారట.
ఇక చంద్రబాబు పొలిటికల్ స్టైలే వేరు. తన అవసరం ఉంటే ఏదైనా చేస్తారు.. తాను నొప్పక అవతలివారిని నొప్పించక పనికానిస్తారు. ఇప్పుడు జనసేన విషయంలోనూ అదే జరగనుందని టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే 50 స్ధానాలను జనసేనకు ఇచ్చే పరిస్థితి లేదు. పవన్కి పది లేదా పదిహేను స్ధానాలకు మించి ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఇదే గనక జరిగితే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని భావిస్తున్న పవన్ ఆశలపై నీళ్లు చల్లినట్టే. ఎందుకంటే పొత్తులో లాభపడేది టీడీపీనే. గతాన్ని పరిశీలిస్తే జరిగింది కూడా ఇదే. ఈ నేపథ్యంలో చంద్రబాబు పొలిటికల్ గేమ్లో పవన్ బలికానున్నారని పలువురు భావిస్తున్నారు. మరి చంద్రబాబు ప్రతిపాదనకు పవన్ ఒప్పుకుంటారా లేదా ఒంటరిగానే బరిలోకి దిగుతారా అన్నది మరికొద్దిరోజుల్లోనే తెలియనుంది.