ఆసియాకప్ సెమీఫైనల్లో చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ చేతులెత్తేసింది. బంగ్లాదేశ్తో జరిగిన సూపర్-4 మ్యాచ్లో 37 పరుగుల తేడాతో ఘోరంగా ఓటమిని చవిచూసి వైదొలిగింది. బంగ్లాదేశ్ నిర్దేశించిన 240 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో తడబడింది. బంగ్లా బౌలర్ల దెబ్బకు 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 202 పరుగులు మాత్రమే చేసి లక్ష్య ఛేదనలో వెనుకబడింది.
ఇమాముల్ హక్ 83 పరుగులతో కాస్తయినా ఆదుకున్నాడు కాబట్టే పాక్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. లేదంటే మరింత భారీ ఓటమినినుంచి తప్పించుకుంది. నిజానికి 18 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకలోతు కష్టాల్లో పడిన పాక్ను ఓపెనర్ ఇమాముల్ హక్ (83), షోయబ్ మాలిక్ (30) ఆదుకున్నారు.
విజయం దిశగా సాగుతున్న పాక్ 85 పరుగుల వద్ద షోయబ్ మాలిక్ అవుటవడంతో పాక్ పతనం ప్రారంభమైంది. ఆ తర్వాత అసిఫ్ అలీ (31)తో కలిసి ఇమాముల్ హక్ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అయితే, అసిఫ్ అలీ, ఆ తర్వాత ఇమాముల్ హక్, హసన్ అలీ (8), మహమ్మద్ నవాజ్ (8) ఇలా వరుసగా పెవిలియన్కు క్యూ కట్టడంతో పాక్ 37 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాదేశ్ 12 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో ముష్ఫికర్ రహీమ్ (99), మహమ్మద్ మిథున్ (60)ల పోరాటంతో బంగ్లాదేశ్ 239 పరుగుల గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. మిగతా బ్యాట్స్మెన్లలో ఎవరూ పెద్దగా చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు.పాక్ బౌలర్లలో జునైద్ ఖాన్ 19 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీసి బంగ్లాదేశ్ను దెబ్బతీశాడు.
గత నాలుగేళ్లలో బంగ్లా జట్టు ఆసియా కప్ ఫైనల్ చేరడం కావడం విశేషం. 2015 నుంచి పాక్, బంగ్లా మధ్య 4 వన్డేలు జరిగితే.. అన్నింట్లోనూ బంగ్లాదేశ్ జట్టే విజయం సాధించింది.