పలువురు యువతులతో శారీరక సంబంధాలు పెట్టుకుని తర్వాత వారిని మోసం చేశారనె ఆరోపణలు ఎదుర్కొంటున్న పాక్ ఓపెనర్ ఇమాముల్ హుక్ ఎట్టకేలకు బేషరతు క్షమాపణలు చెప్పాడు. ఈ వివాదంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సీరియస్గా దృష్టి సారించడంతో క్షమాపణలు తెలియజేశాడు. ఏదైతో జరిగిందో దానిపై ఇమాముల్ పశ్చాత్తాపం వ్యక్తం చేయడమే కాకుండా బోర్డు పెద్దలను క్షమాపణలు కోరాడని పీసీబీ ఎండీ వసీం ఖాన్ తెలిపారు.
ఇమాముల్ తన పలుకుబడిని ఉపయోగించి ఎంతోమంది యువతుల్ని మోసం చేశాడని, వారిని నమ్మించి శారీరక సంబంధాలు కూడా పెట్టుకున్నాడంటూ పాకిస్థాన్కే చెందిన ఓ టీవీ చానల్ ప్రసారం చేసింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇమాముల్పై ఆరోపణలను బోర్డు తీవ్రంగా పరిగణించిందని, ఈ విషయాన్ని అతడి దృష్టికి తీసుకెళ్లినట్టు వాసిం తెలిపారు. అతడి వ్యక్తిగత సంబంధాలపై తాము వ్యాఖ్యానించాలనుకోవడం లేదన్న ఆయన.. పాకిస్థాన్ క్రికెట్కు ప్రతినిధిగా ఇమాముల్ హుందాగా వ్యవహరించాల్సి ఉంటుందని, మరోసారి ఇలాంటి పనులు రిపీట్ కాకుండా చూసుకోవాలని ఇమాముల్ కు వార్నింగ్ ఇచ్చారు.
