కేప్టౌన్ వేదికగా సఫారీ జట్టుతో మొదటి టెస్ట్ ఘోర పరాజయం తర్వాత టీమిండియా టీం వైఫల్యంపై విశ్లేషణలు, విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా గతంలో సఫారీ గడ్డపై రాణించిన అజింక్య రహానేను పక్కనబెట్టి స్థానంలో రోహిత్ శర్మను తీసుకోవటం అన్న అంశం మీదే అవి ఎక్కువగా వినిపిస్తున్నాయి.
అజింకారహానేను మొదటి టెస్ట్లోకి తీసుకోకపోవడంపై తమని ఆశ్చర్యానికి గురిచేసిందని దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ కూడా వెల్లడించాడు. మొదటి టెస్ట్లో భారత బ్యాట్స్మేన్ విఫలం అవ్వడంతో దక్షిణాఫ్రికా 72 పరుగుల తేడాతో విజయం సాధించింది. 208 పరుగుల లక్ష్య ఛేదనలో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరూ క్రీజులో నిలవలేకపోవడంతో భారత్ 135 పరుగులకే ఆలౌటైంది.
పేస్ పిచ్లపై రహానె మెరుగ్గా రాణిస్తాడని అతనికి తుది జట్టులో చోటివ్వాలంటూ ఈ సిరీస్ ఆరంభానికి ముందే భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ టీమిండియా మేనేజ్మెంట్కి సూచించిన విషయం తెలిసిందే. అయితే.. అతని స్థానంలో రోహిత్ శర్మకి కెప్టెన్ కోహ్లి తుది జట్టులో ఛాన్సిచ్చాడు.
భారత్ తుది జట్టు ఎంపిక మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేసింది. జస్ప్రీత్ బుమ్రా, రోహిత్ శర్మ కేప్ టౌన్ టెస్టులో ఆడతారని మేము ఊహించలేదు. ఈ ఇద్దరు క్రికెటర్లు ఇటీవల వన్డే, టీ20ల్లో మెరుగ్గా రాణించారు. అందుకే కాబోలు వారిని ఎంపిక చేశారు. తుది జట్టు ఎంపిక చాలా క్లిష్టమైనది. ఈ విషయం అనుభవపూర్వకంగా నాకు తెలుసు. ఆరుగురు బ్యాట్స్మెన్, ఒక ఆల్రౌండర్, ముగ్గురు పేసర్లు, ఒక స్పిన్నర్ మంచి ఎంపికే’ అని డుప్లెసిస్ వివరించాడు.