భారత్ జట్టును మరో విజయం ఊరిస్తోంది. శ్రీలంకతో ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో 7 వికెట్ల దూరంలో నిలిచింది. భారత్ నిర్దేశించిన 410 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ను ఆరంభించిన లంకేయులు 31 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఎదురీతున్నారు. సదీరా సమరవిక్రమా(5), కరుణరత్నే(13), లక్మల్(0)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరి నిరాశపరిచారు.
లంక జట్టు ఓటమిని తప్పించుకోవాలంటే ఆటలో చివరి రోజైన బుధవారం 379 పరుగులు చేయాల్సి ఉంది. చేతిలో 7 వికెట్లు మాత్రమే ఉండటం.. భారత బౌలర్లు మంచి జోరుమీదుండటంతో చివరి రోజు అద్భుతం జరిగితే తప్ప శ్రీలంకకి ఓటమి ఖాయంగా కనిపిస్తోంది. నాల్గో రోజు ఆట ముగిసేసమయానికి దనంజయ డిసిల్వా(13 బ్యాటింగ్), మాథ్యూస్(0 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నారు.
శ్రీలంకతో మూడో టెస్టులో భారత తన రెండో ఇన్నింగ్స్ను 246/5 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో భారత్కు 409 పరుగుల ఆధిక్యం లభించింది. మంగళవారం నాల్గో రోజు ఆటలో టీ విరామం తరువాత రోహిత్ శర్మ (50 నాటౌట్) హాఫ్ సాధించిన పిదప భారత్ తన రెండో ఇన్నింగ్స్ను డిక్లేర్ చేస్తున్నట్లు ప్రకటించింది.
భారత ఆటగాళ్లలో శిఖర్ ధావన్(67) హాఫ్ సెంచరీ చేయగా, చతేశ్వర పుజారా(49) పరుగు దూరంలో అర్థ శతకం కోల్పోయాడు. అటు తరువాత కోహ్లి-రోహిత్శర్మల జోడి స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. వీరిద్దరూ 90 పరుగులు జోడించిన తరువాత కోహ్లి ఐదో వికెట్గా అవుటయ్యాడు. ఆపై రోహిత్ శర్మ అర్థ శతకాన్ని పూర్తి చేసుకున్నవెంటనే భారత్ ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. ఇప్పటికే మూడు టెస్టుల ఈ సిరీస్లో భారత్ 1-0తో ఆధిక్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
భారత్ తొలి ఇన్నింగ్స్ 536/7 డిక్లేర్, రెండో ఇన్నింగ్స్ 246/5 డిక్లేర్
శ్రీలంక తొలి ఇన్నింగ్స్ 373 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 31/3