వన్డే ప్రపంచకప్లో భాగంగా ఇంగ్లాండ్పై గత ప్రపంచకప్ ఫైనల్లో ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది కివీస్. ఇంగ్లాండ్ విధించిన 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం 36.2 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కొల్పోయి 9 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. ఇక ఈ మ్యాచ్లో కివీస్ పలు రికార్డులను కూడా నమోదుచేసింది.
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ ఆదిలోనే ఓపెనర్ విల్ యంగ్ వికెట్ను కొల్పోయింది. అయితే తర్వాత క్రీజులోకి వచ్చిన భారత సంతతి ఆటగాడు రచిన్ రవీంద్ర…ఓపెనర్ కాన్వేతో కలిసి మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డాడు. ధాటిగా స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తూ మరో వికెట్ పడకుండా లక్ష్యాన్ని చేధించారు. డెవాన్ కాన్వే 121 బంతుల్లో 19 ఫోర్లు, 3సిక్సర్లుతో 152 నాటౌట్, రచిన్ రవీంద్ర 96 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లతో 123 పరుగులతో రాణించారు. ఇందులో రవీంద్రకు ఇది తొలి ప్రపంచకప్ వన్డే కాగా తొలి సెంచరీ కూడా. ఇక కాన్వేకు ఇది ఐదో సెంచరీ. ప్రపంచకప్లో కివీస్ తరపున తక్కువ బంతుల్లో సెంచరీలు చేసిన ఆటగాళ్లుగా నిలిచారు కూడా. కాన్వే 83 బంతుల్లో, రచిన్ రవీంద్ర 82 బంతుల్లో సెంచరీలు బాదారు.
ఇక అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ నిర్ణీత నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. జో రూట్ (77; 86 బంతుల్లో 4ఫోర్లు, 1సిక్స్) ,బట్లర్ (43; 42 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), జానీ బెయిర్ స్టో (33; 35 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించగా మిగితా బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. ఇక రేపు హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో పాకిస్థాన్ – నెదర్లాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది.