రాజకీయం అంటేనే ఎత్తులూ వ్యూహాలూ ప్రతి వ్యూహాలూ అన్నట్టు సాగుతుంది వ్యవహారం. ఆంధ్ర ప్రదేశ్ లోని అధికార పక్షం తెలుగుదేశం ఇప్పుడు జగన్ మొదలు పెట్టబోతున్న గడప గడప కీ అనే కార్యక్రమం ని ఎలా నిలువరించాలి అనే విషయం లో తమ ఆలోచనలు పదును పెట్టింది. గడపగడపకు వైకాపా జండా ఎగరాలి అనే జగన్ మోహన్ రెడ్డి వేసిన కొత్త స్కెచ్ ని ఎదురుకోవడం ఎలా అనేది వారి ప్లాన్.
దాదాపు యాభై వేల కుటుంబాలని ఐదు నెలల వ్యవధిలో మొదలు పెట్టాలి అని చూస్తున్న జగన్ మోహన్ రెడ్డి చంద్రబాబు 2014 లో అధికారం చేపట్టిన దగ్గర నుంచీ చేసిన అవినీతి ని మెయిన్ అజెండా గా తీసుకోబోతున్నారు. ఇలోగా చంద్రబాబు కూడా తన స్కెచ్ ని సిద్దం చేస్తున్నారు అని తెలుస్తోంది. 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన 70 శాతం అంశాలను అమలు చేశామని లెక్కలతో సహా వివరించాలని అధికార పార్టీ నిర్ణయించింది.
మేనిఫెస్టోలో లేని అంశాలను కూడా అమలు చేస్తున్నతీరును ప్రజలకు స్పష్టం చేయనున్నారని సమాచారం. ఎన్నికల హామీల అమలుపై చర్చకు సిద్ధమా అంటూ వైకాపాను సవాల్ చేసే విధంగా ఈ ప్రశ్నావళి రూపొందించినట్లుగా చెప్తున్నారు.