తెలంగాణ అసెంబ్లీ నామినేషన్ల పర్వం తుది అంకానికి చేరుకుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో నామినేషన్ల పర్వం ముగియనుంది. ఇక నిన్న రాత్రి కాంగ్రెస్ పార్టీ తుది జాబితాను విడుదల చేయగా ఇందులో పటాన్ చెరు టికెట్ను తిరిగి కాటా శ్రీనివాస్ గౌడ్కు ఇచ్చింది. వాస్తవానికి అప్పటికే ఈ సీటును బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లో చేరిన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన నీలం మధుకు కేటాయించింది.
దీంతో పటాన్చెరు వ్యవహారం రచ్చరచ్చగా మారింది. తన అనుచరుడికి సీటు రాకపోవడంతో పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహా. ఇక కాటా శ్రీనివాస్ అనుచరులు సైతం గాంధీ భవన్కు తాలం వేసి మరి నిరసనలు తెలిపారు. ఇక నీలం మధుకు మద్దతుగా జగ్గారెడ్డి నిలిచారు. పటాన్ చెరు సీటు మారిస్తే తానేంటో చూపిస్తానని చెప్పడంతో రంగంలోకి దిగింది అధిష్టానం. అనేక సంప్రదింపుల అనంతరం తన పంతం నెగ్గించుకున్న దామోదర తిరిగి కాటా శ్రీనివాస్కే టికెట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు.
ఇక ఈ సారి ఎలాగైనా పోటీ చేసి అసెంబ్లీలో అడుగుపెట్టాలని భావించిన నీలం మధు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోవడంతో ఆ పార్టీకి గుడ్ బై చెప్పేసి బీఎస్పీలో చేరిపోయారు. ఇవాళ నామినేషన్లకు చివరి రోజు కావడంతో ఆయన నామినేషన్ దాఖలు చేసి పోటీలో ఉండనున్నారు. కాంగ్రెస్ పార్టీ తనను మోసం చేసిందని…అందుకే అంబేద్కర్ భావజాలం కలిగిన బీఎస్పీలో చేరినట్లు తెలిపారు. మొత్తంగా నీలం మధు వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.