తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాట్సాప్ సేవకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే 3.25 లక్షల మందికి పైగా పౌరులు ఈ సేవల ద్వారా ప్రభుత్వ సదుపాయాలను వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమం వల్ల ప్రభుత్వ సేవలను సులభంగా పొందడం సాధ్యమవుతూ, సేవా కేంద్రాలకు పదేపదే వెళ్లాల్సిన అవసరం తగ్గిందని పేర్కొన్నారు.
వాట్సాప్ సేవ అనేది 24×7 పనిచేసే డిజిటల్ పౌర సేవల వేదిక. ప్రజలు 8096958096 నంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపడం ద్వారా నేరుగా ప్రభుత్వ సేవలను పొందవచ్చు. ప్రస్తుతం ఈ వేదికలో 10కుపైగా ప్రభుత్వ శాఖల నుంచి 581 సేవలు అందుబాటులో ఉండటం దేశంలోనే అత్యంత సమగ్ర డిజిటల్ సేవల వేదికలలో ఒకటిగా నిలుస్తోంది.
4.5 లక్షల మందికి పైగా పౌరులు వాట్సాప్ సేవలో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.3.25 లక్షల మందికి పైగా ఇప్పటికే సేవలను వినియోగించారు.24 గంటల పాటు సేవలు అందుబాటులో ఉన్నాయి.దరఖాస్తుల స్థితిని తెలుసుకోవడం, సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసుకోవడం నేరుగా వాట్సాప్లోనే సాధ్యం.
డిజిటల్ పరిజ్ఞానం తక్కువగా ఉన్నవారికి కూడా ఈ సేవ ఎంతో ఉపయోగకరంగా మారిందని అధికారులు తెలిపారు. ప్రజలు ఎక్కువగా వినియోగిస్తున్న సేవలను పరిశీలిస్తే..
కుల ధృవీకరణ పత్రాలు
ఆదాయ ధృవీకరణ పత్రాలు
జనన ధృవీకరణ పత్రాలు
మరణ ధృవీకరణ పత్రాలు
సేవల స్థితి తెలుసుకునే సౌకర్యం, సర్టిఫికెట్లు డౌన్లోడ్ చేసే అవకాశం వల్ల భౌతిక సేవా కేంద్రాల్లో రద్దీ గణనీయంగా తగ్గిందని అధికారులు చెప్పారు.
ఆలయ సేవలూ అందుబాటులో
వాట్సాప్ సేవ ద్వారా 31 ఆలయ సంబంధిత సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులు:
దర్శన బుకింగ్
వసతి గదుల రిజర్వేషన్
ఇతర ఆలయ సదుపాయాలు
ఇవన్నీ ఆలయ కార్యాలయాలకు వెళ్లకుండానే వాట్సాప్ ద్వారా పొందవచ్చు.
త్వరలో అత్యవసర సేవల అనుసంధానం
108, 101, 102 వంటి అత్యవసర సేవలను త్వరలోనే వాట్సాప్ సేవతో అనుసంధానం చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. దీని ద్వారా ప్రజా భద్రత, అత్యవసర స్పందన మరింత మెరుగవనుంది. తెలంగాణ వ్యాప్తంగా 5,000కుపైగా సేవా కేంద్రాలు ఉన్నాయి. రోజుకు సుమారు 80 వేల నుంచి లక్ష మంది వరకు ఈ సేవలను వినియోగిస్తున్నారు.
