ఏపీ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. అధికార వైసీపీ, విపక్ష టీడీపీ కూటమి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇక ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై తీవ్ర చర్చజరుగుతోంది. టీడీపీ ఈ అంశాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకోగా వైసీపీ నేతలు సమర్ధవంతంగా తిప్పికొడుతున్నారు.
వాస్తవానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను గత ఏడాది ప్రవేశపెట్టారు జగన్. సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే 2019 జూలైలో ల్యాండ్ టైట్లింగ్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించారు. పలు మార్పుల తర్వాత గత ఏడాది దానికి కేంద్రం ఆమోదముద్ర వేసింది. అక్టోబర్ 31 నుంచి ఏపీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్-2023 అమల్లోకి వచ్చింది.
కొత్త చట్టం ప్రకారం ఎటువంటి అభ్యంతరాలు లేని పేర్లే టైటిల్ రిజిస్టర్లో ఉంటాయి. వివాదాలు ఉన్న భూములను ప్రత్యేకంగా వివాదాల రిజిస్టర్లో నమోదు చేస్తారు. చట్టం ప్రకారం టైటిల్ నిర్ధారించే క్రమంలో భూ సమస్యలు ఏర్పడితే పరిష్కారం కోసం ట్రిబ్యునళ్ల వ్యవస్థ ఏర్పాటవుతుంది. ట్రిబ్యునల్ తీర్పులపై అభ్యంతరం ఉంటే హైకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. టైటిల్ రిజిష్టర్లో నమోదైన వివరాలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహిస్తుంది. భూముల రిజిస్ట్రేషన్ జరుగుతున్నప్పుడే టైటిల్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అమ్మేవాడికి టైటిల్ ఉంటేనే కొనేవాడికి వస్తుంది. దీనివల్ల మోసం జరగడానికి వీలు లేకుండా పోతుంది. భూ యజమానులకు రక్షణ కల్పించేందుకే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు జగన్.
వాస్తవానికి దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని తేవాలని భావించిన సాధ్యం కాలేదు. కానీ జగన్ మాత్రం పట్టుదలతో ఈ చట్టాన్ని తెచ్చారు. అయితే ఇదే జరిగితే తమ ఉనికికే ప్రమాదమని భావిస్తున్న విపక్షాలు దీనిపై తప్పుడు ప్రచారానికి తెరలేపాయి. కావాలనే గందరగోళం సృష్టించి లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ల్యాండ్ టైటిలింగ్ చట్టం వల్ల మేలే జరుగుతుందని అభిప్రాయ పడుతున్నారు నిపుణులు. ఈ చట్టం అమలైతే రాష్ట్రంలో భూవివాదాలు 90 శాతం కనుమరుగవుతాయని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.