హైదరాబాద్ శివారులో విషాద సంఘటన చోటుచేసుకుంది. శివారు ప్రాంతంలోని ఓ కోళ్లఫారంలో నలుగురు యువకులు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. ఈ విషాద సంఘటన మేడ్చల్ జిల్లా శామీర్పేట్ మండలం బొమ్మరాసిపేటలో జరిగింది. అక్కడ కోళ్లఫారంలో పనిచేసే నలుగురు యువకులు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.
మృతులను మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం వాసులుగా పోలీసులు గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతులను సతీశ్ గౌడ్(20), అరవింద్ గౌడ్(23), మహేశ్ ముదిరాజ్(20), మహేందర్ రెడ్డి(25)లుగా గుర్తించారు పోలీసులు.
వీరంతా 25ఏళ్ల లోపు వయసువారే కావడం బాధాకరం. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లాకు చెందిన వీళ్లు గత నెల రోజులుగా కేజీఎల్ కోళ్లఫారంలో పనిచేస్తున్నారు. గురువారం నాడు యువకులు రాత్రి పొద్దుపోయే వరకు కోళ్లకు ఇంజక్షన్ చేసినట్లుగా తెలుస్తోంది. కోళ్లు తక్కువ కాలంలో బరువు పెరగడానికి యజమానులు వాటికి స్టెరాయిడ్స్ ఇస్తుంటారు. ఈ ఇంజక్షన్లు వేసిన అనంతరం యువకులు భోజనం చేసి నిద్రపోయినట్టు యజమాని పేర్కొన్నారు.
ఈ దుర్ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వీరిది సహజమరణమా లేకా ఇంకేదైనా అనేది పోస్ట్మార్ట్ంలో తేలుతుందన్నారు. అప్పటి వరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.