తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ నోటి నుంచి అనూహ్యమైన వ్యాఖ్య వచ్చింది. ఐటీ అభివృద్ధిలో తన మార్కు కోసం ప్రయత్నిస్తున్న మంత్రి కేటీఆర్ ఈ క్రమంలో తన మనసులోని మాటను నిర్మోహమాటంగా చెప్పేశారు. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్కు స్థానం కల్పించిన ఘనత చంద్రబాబుదేననే ప్రచారానికి కేటీఆర్ సంఘీభావం తెలిపారు. ఇన్నాళ్లు హైదరాబాద్లో ఉన్న అనుకూలతల కారణంగా ఐటీ అభివృద్ధి జరిగిందన్న మంత్రి కేటీఆర్..ఈ రోజు ఆశ్చర్యకరంగా మాట మార్చేశారు.
హైదరాబాద్ టెక్మహీంద్రా క్యాంపస్లో మిషన్ ఇన్నోవేషన్ సదస్సుకు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. సదస్సులో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ఐటీలో మేటి కంపెనీలు కూడా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాయని తెలిపారు. ప్రపంచ ఐటీ రంగంలో హైదరాబాద్ను నిలపడంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్ర పోషించారని ఆ సంస్థ చైర్మన్ బిల్గేట్స్తో సంప్రదింపులు చేశారని అన్నారు. చంద్రబాబు కారణంగానే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్కు వచ్చిందని…ఈ విషయంలో తనకు డక్రెడిట్ తీసుకోవాలనే ఆకాంక్ష లేదన్నారు. అయితే హైదరాబాద్లో ఐటీ రంగం అభివృద్ధి చెందడం వెనుక అనేక కారణాలు ఉన్నాయన్నారు. బెంగళూర్, చెన్నై, గుర్గావ్తో పోల్చుకుంటే…హైదరాబాద్ నగరం పర్యావరణహితం, మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయన్నారు. అనేక కంపెనీలు హైదరాబాద్ బాట పట్టేందుకు ఇవన్నీ కీలక కారణాలని ఆయన వివరించారు.
ఐటీ రంగంలో హైదరాబాద్కు ప్రత్యేక గుర్తింపు ఉందని ఐటీ మంత్రి కేటీఆర్ అన్నారు. దిగ్గజ ఐటీ కంపెనీలు హైదరాబాద్కు తరలివస్తున్నాయన్నారు. ఉపాధి అవకాశాల్లో యువతకు శిక్షణ కోసం ఐటీని వాడుకుంటున్నం. పాఠశాల విద్యనుంచే శిక్షణతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. కాలేజీలు, పరిశ్రమల భాగస్వామ్యంతో ఉపాధి, నైపుణ్య అభివృద్ధిలో యువతకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. కులీకుతుబ్షా నిర్మించిన ఈ నగరం ప్రపంచ ఖ్యాతిని పొందిందన్నారు. నిరంతర కృషితో వెలుగుల తెలంగాణ సాధించామన్నారు. రెప్పపాటు కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఇంటింటికీ నీళ్లుఇవ్వాలనే మిషన్ భగీరథ తీసుకొచ్చినట్లు వివరించారు. విశ్వనగరం విజన్తో ముందుకు వెళ్తునట్లు వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే… చంద్రబాబును టీఆర్ఎస్ సోషల్ మీడియా ఫ్యాన్స్ – ప్రపంచ పటంలో హైదరాబాదు పెట్టినోడు అని వ్యంగంగా బాబును పిలుచుకని సెటైర్లు వేస్తున్న నేపథ్యంలో కేటీఆర్ చేసిన ఈ కామెంట్లు వారందరినీ ఇరుకున పడేయనున్నాయి. ఇక నుంచి హైదరాబాదు-చంద్రబాబు కామెంట్లను చేయాలంటే టీఆర్ఎస్ అభిమానులు ముందు వెనుకా ఆలోచించాల్సిన పరిస్థితిన కేటీఆర్ క్రియేట్ చేశారు.