ఏపీసీఎం చంద్రబాబు, అమరవాతి రాజధాని నిర్మానంపై మరో మాజీ సీఎస్ విమర్శలు ఎక్కుపెట్టారు. 1983 బ్యాచ్ ఐఎఎస్ అధికారి అయిన అజయ్ వృత్తిపరంగా నిజాయితీ పరుడనే గుర్తింపు ఉంది. ఆయన తాజాగా ఓ పుస్తకం రాశారు. ‘ మేలు కొలుపు’ పేరుతో రాసిన పుస్తకం ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నట్లు చెప్పారు. తాను రాసిన పుస్తకంలో ప్రస్తుత రాజకీయాలు, యువతలో ప్రశ్నించే తత్వం తదితర అంశాలను ప్రస్తావించినట్లు తెలిపారు.
రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాజధాని నిర్మాణం పేరుతో భారీ ఎత్తున డబ్బులు వృధా చేస్తున్నారని కల్లాం ఆరోపించారు. ఇటీవలే మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు సైతం టీడీపీ సర్కారు విధానాలను తప్పుపట్టిన నేపథ్యంలో తాజాగా కల్లాం వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అమరావతిలో అవినీతికి సంబంధించి తానో పుస్తకం రాశానన్న ఆయన శుక్రవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
అనుభవజ్ఞుల పాలన అంటే పెద్ద పెద్ద నగరాలు కట్టడంకాదు. గ్రామీణ ప్రాంతాల్లో జరిగితేనే నిజమైన అభివృద్ధి. మహానగరాల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నది. ప్రభుత్వాలు వ్యాపారాలు చేయడం వల్ల ప్రజలకు మేలు జరగదు. పైగా అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం సరైన భావనకాదు. విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం నగరాలకు పరిపాలనను విస్తరించాలి. కొత్త రాష్ట్రంలో ప్రజలకు మంచి జరగకపోగా పాలకుల అవినీతి చాలా పెరిగిపోయింది. దీనివల్ల వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదముంది. నిజానికి ఏపీలో కొత్త రాజధాని కట్టాలనుకునేది కేవలం పైరవీల కోసం మాత్రమే. రాజధాని పేరుతో భారీగా డబ్బును దుబారా చేస్తున్నారు’’ అని అజయ్ కల్లాం అన్నారు.
పనిలో పనిగా పవన్పైకూడా పరోక్షంగా విమర్శలు చేశారు. మేకప్లు వేసుకున్న కొందరు రాజకీయాలు చేస్తున్నారు. ఇలాంటి వాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’ అని అన్నారు. ప్రస్తుత యువతరంలో ప్రశ్నించే తత్వం లోపిస్తున్నదని కల్లాం ఆవేదన వ్యక్తం చేశారు.
ఆయన వ్యాఖ్యలు వింటుంటే.. టీడీపీ, జనసేనలకు వ్యతిరేకంగానే పుస్తకం రాసినట్లు అనిపిస్తోంది. మరి ఈ పుస్తకం రాజకీయంగా ఎంత దుమారం రేపుతుందో వేచి చూడాలి