తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాటెత్తితే విదేశాల పేర్లే చెబుతారు. ఏపీని సింగపూర్ స్థాయిలో అభివృద్ధి పరుస్తామని.. ఏపీలో షాంఘై స్థాయి రాజధాని నిర్మింపజేస్తామని.. బాబు చెబుతుంటారు. ఇంకా టోక్యో వంటి నగరాల పేర్లను కూడా చెబుతుంటారాయన.
ఈ విధంగా బాబు గారు తరచూ విదేశీ నామస్మరణ చేస్తుంటారు. మరి కేవలం ప్రజల విషయంలోనే కాదు.. పార్టీ విషయంలో కూడా బాబు విదేశీ టెక్నాలజీ అనే అంటున్నాడు!
ఇప్పుడు హైదరాబాద్ లో భారీ ఎత్తున నిర్వహిస్తున్న మహానాడు విషయంలో కూడా బాబు విదేశీ టెక్నాలజీనే ఉపయోగించేస్తుండటం విశేషం. ప్రస్తుతం ఎండ తీవ్రత ఏ స్థాయిలో ఉందో వేరే చెప్పనక్కర్లేదు. హైదరాబాద్ కూడా దీనికి మినహాయింపు ఏమీ కాదు. ఈ నేపథ్యంలో పార్టీ మీటింగు అంటే.. దానికి హాజరయ్యే వారికి తడిచిపోతుంది! అసలు ఈ ఎండలకు బయటకు రావడానికి కూడా చాలా మంది సందేహిస్తారు. అలాంటి మహానాడుకు జనాలను రప్పించడం అంటే మాటలు కాదు.
అయితే దానికి తెగించి వచ్చిన వారికి మాత్రం తెలుగుదేశం పార్టీ వాళ్లు కొంత స్వాంతనను ఇస్తున్నారు. మహానాడు వేదిక ప్రాంతంలో చల్లదనాన్ని పరిచే యత్నం చేస్తున్నారు. జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి వాతావరణాన్ని చల్లబరుస్తారట. దీని ద్వారా ఉష్ణోగ్రత దాదాపు మూడు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకూ తగ్గుతుందని తెలుగుదేశం నేతలే వివరిస్తున్నారు. అయితే ఈ ఏర్పాట్లు అంతా వేదిక వరకే పరిమితం. నేతలను చూడటానికి వచ్చే కార్యకర్తలు మాత్రం ఎండ వేడిమిని భరించాల్సిందే!