ఆంధ్రప్రదేశ్ 14వ శాసనసభ చివరి సమావేశాలు. ఎన్నికల ముందు జరిగే ముందు సమావేశాలు కావడంతో చాలా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ నాలుగేళ్లలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ ఫలాలు.. రాష్ట్రానికి జరిగిన అన్యాయం.. అభివృద్ధికి అడ్డుపడుతున్న వారిపై విమర్శలు.. ఇలా అధికార పార్టీ ఏమీ చేయాలనుకున్నా అధికారికంగా దొరికిన వేదిక. ఎలాగు అభ్యంతరం చెప్పడానికి ప్రతిపక్ష పార్టీ లేదు. ఇక అధికార పార్టీ పాడిందే పాట.
సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ప్రసంగించారు. ఎలాగు ప్రభుత్వం (చంద్రబాబు) అందించిన ప్రసంగం చదవడమే గవర్నర్ పని కాబట్టి ఆయన కూడా ఉన్నది ఉన్నట్టు పొల్లు పోకుండా చదివేశారు.
ఎన్టీఆర్ భరోసా పింఛన్ మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2 వేలకు పెంచామని, త్రీ వీలర్ వాహనాలకు పన్ను మినహాయింపులు ఇచ్చామని… వ్యవసాయ రంగంలో వాడుతున్న యంత్ర పరికరాలకు కూడా ఇవే మినహాయింపులను అమలు చేస్తున్నామని.. స్వయం సహాయక బృంద సభ్యులకు రూ. 10 వేలు కూడా మంజూరు చేశామన్నారు. ఇక కేంద్రం అగ్రవర్ణ పేదలకు ప్రకటించిన 10 శాతం రిజర్వేషన్లలో 5 శాతం రిజర్వేషన్లను ఒక్క కాపులకే ఇవ్వాలని కూడా తన ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
పనిలో పనిగా కేంద్రం ఏ మాత్రం సహకరించకున్నా తాము అభివృద్ధి పథంలో పయనిస్తున్నామని, గడచిన నాలుగున్నరేళ్ల వ్యవధిలో వివిధ రంగాల్లో జరిగిన అభివృద్ధిపై 10 శ్వేతపత్రాలను ఇటీవలే విడుదల చేశామని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన అసంబద్ధంగా జరిగిందని, కడపకు మంజూరు చేస్తామన్న ఉక్కు కర్మాగారాన్ని, కేంద్ర సహకారం లేకుండానే తన ప్రభుత్వం చేపట్టిందని, దీని వల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు దగ్గర కానున్నాయని గవర్నర్ చెప్పారు. కేంద్రం సకాలంలో నిధులను అందించకున్నా, రాజధాని నిర్మాణం శర వేగంగా ముందుకు సాగుతోందని… జాతీయ సగటుతో పోలిస్తే, రాష్ట్ర వృద్ధి అధికంగా గవర్నర్ తెలిపారు.
పాపం కేంద్ర ప్రభుత్వంచే నియమితులైన ఆయనతోనే.. కేంద్రంపై విమర్శలు కురిపించారు చంద్రబాబు. ఇక గవర్నర్ బైలైన్తోనే అన్ని మీడియా ఛానళ్లు వాటిని బ్రేకింగ్లు ఇచ్చాయి. ఇక గవర్నర్ మాట్లాడిన దాంట్లో నిజ నిజాలు ఎంత? ఒకవేళ నిజాలే అయితే నాలుగేళ్లు గుర్తుకురాని సంక్షేమం.. ఇప్పుడేందుకు గుర్తొచ్చింది అని ప్రశ్నించడానికి.. ఖండించడానికి శాసనసభలో ఎవరూ లేరు. కాబట్టి ధన్యవాద తీర్మాన ఆమోదం కూడా లాంఛనమే.