ఆంధ్రప్రదేశ్ లో కాపు కులస్తులు చేస్తున్న ఉద్యమం నానాటికి పెరుగుతోంది. ఆ జాతి నాయకుడు ముద్రగడ పద్మనాభం చేపట్టిన దీక్ష, అనంతరం ఆయన అరెస్టు, కాపు యువకులను అదుపులోకి తీసుకోవడం వంటి సంఘటనలతో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కాపు నాయకులు మండిపడుతున్నారు. తుని సంఘటన అనంతరం ముద్రగడతో జరిగిన చర్చల్లో తుని ఘటనపై ఎలాంటి చర్యలు తీసుకోమని చెప్పి ముద్రగడన ఒప్పించిన చంద్రబాబు దూతలు ఇప్పుడు మాట తప్పారు. అయితే తమ బాస్ చెప్పిన పలుకులే పలికిన నాయకులు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు నివ్వెరపోతున్నారు.
ముద్రగడను ఎలాగైనా తమ వైపు తిప్పుకోవాలని ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొడుతున్నాయి. దీంతో తెలుగుదేశంలో ఉన్న కాపు నాయకులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. మరోవైపు వైద్యానికి, దీక్ష విరమణకు ఆసుపత్రతిలోనే ససేమిరా అంటున్న ముద్రగడకు రాష్ట్ర వ్యాప్తంగా.. ఆ మాటకొస్తే తెలంగాణలోనూ, ఇతర రాష్ట్రాల్లోనూ ఉంటున్న కాపులు మద్దతు తెలుపుతున్నారు. దీక్షను విరమింపచేయడం కాపు నాయకుల వశం కావడం లేదు. ఆసుపత్రిలో ముద్రగడను కలిసిన బిజిపి రాజమండ్రి ఎమ్మెల్యే చర్చలకు ముద్రగడ ఒప్పుకున్నారని ప్రకటించారు.
అయితే ఆయన ముద్రగడతో చర్చించిన తర్వాత విలేకరుల సమావేశంలో ముద్రగడతో తనతో అన్న వ్యాఖ్యలు బహిర్గతం చేసి కొన్ని గంటలు గడచినా ప్రభుత్వం నుంచి మాత్రం ఎటువంటి ప్రకటన రాకపోవడం గమనార్హం. ఇక ఆసుపత్రిలో దీక్షలో ఉన్న ముద్రగడ పద్మనాభంకు ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ ఆయన అనుచరుల్లో పెరుగుతోంది. నాలుగు రోజుల క్రితం ఉభయ గోదావరి జిల్లాల్లో బంద్ కు పిలుపునిచ్చిన కాపు నాయకులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్త బంద్ కు సమాయత్తవుతున్నారు. ఇది కనుక జరిగితే చంద్రబాబు ఇరకాటంలో పడినట్లే. సిఎం తన మంత్రులు, ఇతర నాయకుల చేత ముద్రగడకు వ్యతిరేకంగా ఎన్ని ప్రకటనలు చేయించినా కాపు యువత మాత్రం ముద్రగడ వెనుకే ఉండడం ఈ నిప్పుకు ఆజ్యమే.