కాపు నాయకుడు ముద్రగడ పద్మనాభం తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలోని తన సొంత ఇంట్లో ఆమరణ దీక్ష చేపట్టారు. కాపుల డిమాండ్లను పరిష్కారించాలని, తుని ఘటనకు బాధ్యులంటూ అరెస్టు చేసిన కొందరు యువకులను వెంటనే విడుదల చేయాలంటూ ఆయన తన భార్యతో కలిసి దీక్ష చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి కాపు నాయకులు, యువకులు కిర్లంపూడి చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పెద్ద ఎత్తున పోలీసులను మోహరించింది ప్రభుత్వం. దీక్ష చేస్తున్న ముద్రగడను అరెస్టు చేస్తారనే వదంతులు రావడంతో కిర్లంపూడిలో యుద్ధ వాతావరణం నెలకొంది.
ఈ పరిణామాలను ముందే ఊహించిన ప్రభుత్వం పోలీసులు, ఇతర ఫోర్సులను దించేందుకు రంగం చేసింది. కిర్లంపూడిలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక స్ధానికులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు తనను అరెస్టు చేస్తే ఆత్మాహతికి సైతం సిద్ధమని ముద్రగడ ప్రకటించారు. దీంతో కాపు యువత మరింత ఆందోళనలో ఉంది.