ఆంధ్రప్రదేశ్ ప్రజల వ్యక్తిగత డేటా చోరీ స్కాంలో అధికార పార్టీపై ఆరోపణల నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ తన అధికారిక వెబ్సైట్ను షట్డౌన్ చేసింది . టీడీపీ వెబ్సైట్ ఓపెన్ చేస్తే ‘ఎర్రర్’ అని చూపిస్తోంది. టీడీపీ యాప్ తయారీ సంస్థ ఐటీ గ్రిడ్స్ సంస్థపై డేటా చోరీ కేసు నమోదైన వెంటనే మొదటసేవామిత్ర యాప్లో డేటాను మొత్తం తొలగించారు. ఇప్పుడు టీడీపీ అధికారిక వెబ్సైట్ www.telugudesam.org షట్డౌన్ చేయడం ప్రస్తుతం కొత్త అనుమానాలకు తావిస్తోంది. టీడీపీ ఆన్లైన్ సభ్యత్వాన్ని కూడా ఇంతకుముందే హఠాత్తుగా నిలిపివేశారు.
టెక్నాలజీ వినియోగంలో దేశంలో నా తరువాతే ఎవరైనా అనే చంద్రబాబు.. ఇప్పుడు తన వెబ్ సైట్ ను షట్ డౌన్ చేసిన వైనం నిజంగానే ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇప్పుడు టీడీపీ వెబ్ సైట్ను ఒపెన్ చేసేవారికి ఆ సైట్ హోమ్ పేజీ ఓపెన్ కావడం లేదు. ఓ బ్లాంక్ పేజి ఓపెన్ అవడంతో పాటుగా స్క్రీన్పై ఎర్రర్ అనే అక్షరాలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ స్వయంగా తన వెబ్ సైట్ ను షట్ డౌన్ చేసినట్గుగా తెలుస్తోంది.
అయితే టీడీపీ ఈ పని ఎందుకు చేసిందన్న విషయానికి వస్తే… డేటా చోరీ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్ అధినేత అశోక్ ఇంకా పోలీసుల ఎదుటకు రాలేదు. మంత్రి నారా లోకేశ్తో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరం అశోక్కు సత్సంబంధాలున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఏకంగా లోకేశ్తో కలిసి ఆయన అధికారిక సమీక్షా సమావేశంలో పాల్గొన్న విషయం బయటపడింది. గుట్టురట్టు కావడంతో అధికారుల్లోనూ ఆందోళన మొదలైంది. మరోవైపు ఐటీ గ్రిడ్స్, బ్లూ ఫ్రాగ్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాల్లో మార్పులు చేయాలని మంత్రి లోకేశ్ ఆదేశించడంతో ఉన్నతాధికారులు ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ ఫైళ్లను పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. డేటా చోరీ కేసులో అన్నివైపుల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు సర్కారు దీని నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్నట్టు కనబడుతోంది.
ఇక బుధవారం సాయంత్రంలోగా తమ ముందు హాజరుకావాలని తెలంగాణ పోలీసులు జారీ చేసిన నోటీసులను అశోక్ ఎంతమాత్రం పట్టించుకోలేదు. కేసు నమోదైన విషయం తెలియగానే అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన అశోక్… ఎక్కడున్నాడో కూడా తెలియడం లేదు. ఈ వ్యవహరమంతా చూస్తుంటే ఈ కేసులో తెలంగాణ పోలీసులు ఆరోపిస్తున్నట్లుగా పెద్ద గూడు పుఠాని ఉన్నట్టేనన్న అనుమానాలు బలపడుతున్నాయి.