మంత్రి భూమా అఖిలప్రియకు కర్నూలు జిల్లాలో షాక్ తగిలింది. ప్రస్తుతం అఖిల ఒంటరైపోయింది. ఇటీవలే జిల్లానేతలతో జరిపిన సమీక్ష సమావేశంలో పలువురు నేతలు బాబుకు ఫిర్యాదు చేయడంతో అఖిల బిత్తరపోయింది. నంద్యాల ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి హటాన్మరణంతో కూతురు, ఆళ్ళగడ్డ ఎంఎల్ఏ భూమా అఖిలప్రియకు సిఎం మంత్రివర్గంలో చోటు కల్పించారు.
మంత్రైన దగ్గర నుండి మాత్రం ఒంటెత్తు పోకడలాగే ఉంది. జిల్లాలో ఏ నేతతోనూ సత్సంబంధాలు లేవు. పోనీ శాఖలోని ఉన్నతాధికారులతో మంచి సంబంధాలున్నాయా అంటే అదీ లేదు. శాఖపైన పట్టుకూడా సాధించలేదు. ఈ విషయాలపైనే అఖిలను చంద్రబాబు పలుమార్లు బాహాటంగానే హెచ్చరించినా మంత్రిలో మార్పు రావడంలేదు.
ఎన్నికల సమయంలోకూడా అఖిల వ్యవహారశైలి నచ్చక సీనియర్నేతులు దూరంగా ఉన్నారు. కాని బాబు కల్పించుకోవడంతో ఉప ఎన్నికలో పలా పంచుకున్నారు. నియోజకవర్గంలో కీలకమైన ఏవీ సుబ్బారెడ్డితో పడదు. శాసనమండలి ఛైర్మన్ ఎన్ఎండి ఫరూఖ్ తో పొసగదు. జిల్లాలో సీనియర్, ఉపముఖ్యమంత్రి, రెవిన్యూమంత్రి అయిన కెఇ కృష్ణమూర్తి అంటే గిట్టదు. అంతెందుకు స్వయానా మేనమామ, కర్నూలు ఎంఎల్ఏ ఎస్వీ మోహన్ రెడ్డితోనే పడదు. ఇలా అందర్నీ దూరంచేసుకోంటోంది అఖిలప్రియ. నంద్యాల ఉప ఎన్నికలో సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి గెలిచిన తర్వాత అఖిల మరింతగా రెచ్చిపోతున్నారు.
సమీక్ష సమావేశంలో సీనియర్ నేతలు అఖిలపై బాబుకు ఫిర్యాదులు చేయడంతో మంత్రికి ఫుల్లుగా క్లాస్ పీకారు. అంతేకాకుండా జిల్లా సమస్యల పరిష్కారానికి కెఇ కృష్ణమూర్తికి బాధ్యతలు అప్పగించటంతో అఖిలకు ఏమి చేయాలో పాలుపోవటం లేదు. ఇలా అందర్నీ దూరం చేసుకుంటున్న అఖిల వచ్చే ఎన్నికలనాటికి పరిస్థితి ఎలా ఉంటుందో.